డిప్యూటీ మేయర్‌-2గా నిత్యానందరెడ్డి ఏకగ్రీవం

ABN , First Publish Date - 2021-07-31T05:11:28+05:30 IST

కడప కార్పొరేషన రెండవ డిప్యూటీ మేయర్‌గా నిత్యానందిరెడ్డి ఎన్నిక ఏకగ్రీవం అయిందని కలెక్టర్‌ వి.విజయరామరాజు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు శుక్రవారం కార్పొరేషన సర్వసభ్య సమావేశం మందిరంలో

డిప్యూటీ మేయర్‌-2గా నిత్యానందరెడ్డి ఏకగ్రీవం
ప్రమాణ స్వీకారం చేస్తున్న నిత్యానందరెడ్డి

కడప(ఎర్రముక్కపల్లె), జూలై 30: కడప కార్పొరేషన రెండవ డిప్యూటీ మేయర్‌గా నిత్యానందిరెడ్డి ఎన్నిక ఏకగ్రీవం అయిందని కలెక్టర్‌ వి.విజయరామరాజు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు శుక్రవారం కార్పొరేషన సర్వసభ్య సమావేశం మందిరంలో  రెండవ డిప్యూటీ మేయర్‌ పదవికి కలెక్టర్‌ అధ్యక్షతన ఎన్నికలు జరిగాయి. ఈ ప్రత్యేక సమావేశానికి ఎక్స్‌ అఫిషియో మెంబర్లుగా ఉపముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డితోపాటు కడప మేయర్‌ సురే్‌షబాబు, డిప్యూటీ మేయర్‌ ముంతాజ్‌బేగం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రెండవ డిప్యూటీ మేయర్‌ కోసం 18 డివిజన కార్పొరేటర్‌ బండి నిత్యానందరెడ్డి ఒక్కరు మాత్రమే బి.ఫారం ఇచ్చినందున ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు. అనంతరం డిప్యూటీ మేయర్‌గా బండి నిత్యానందరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనను కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛమిచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో జేసీ (అభివృద్ధి) సాయికాంతవర్మ, కార్పొరేషన సెక్రటరి రమణారెడ్డి, మేనేజర్‌ ఇదాయతుల్లా తదితరులు పాల్గొన్నారు.


జమ్మలమడుగు వైస్‌చైర్మన-2గా సింగరయ్య

జమ్మలమడుగు రూరల్‌, జూలై 30: జమ్మలమడుగు నగర పంచాయతీకి వైస్‌చైౖర్మన-2గా 15వ వార్డుకు చెందిన కౌన్సిలరు సింగరయ్య ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం కార్యాలయ సభాభవనంలో కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి ఎన్నికల అధికారి, ఆర్డీవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అనంతరం జమ్మలమడుగు పట్టణంలో నగర పంచాయతీ కార్యాలయం వద్ద నుంచి సింగరయ్యను ఊరేగింపుగా తీసుకెళ్లారు.


ఎర్రగుంట్లకు వర్రా చంద్రకళ..

ఎర్రగుంట్ల, జూలై 30: ఎర్రగుంట్ల నగరపంచాయతి రెండవ వైస్‌చైర్‌పర్సనగా వర్రా చంద్రకళ ఎన్నికయ్యారు. శుక్రవారం రాణీవనంలోని ఎంపీడీవో సభాభవనంలో జాయింట్‌ కలెక్టర్‌ ధర్మచంద్రారెడ్డి అధ్యక్షతన ఎన్నిక జరిగింది. 2వ వార్డు కౌన్సిలర్‌ వర్రా చంద్రకళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు.


బద్వేలుకు సాయిక్రిష్ణ

బద్వేలు, జూలై 30: బద్వేలు మున్సిపల్‌ వైస్‌చైర్మన-2గా 10వ వార్డు కౌన్సిలర్‌ రాచపూడి సాయిక్రిష్ణ ఎన్నికయ్యారు. బద్వేలు పట్టణంలోని మార్కెట్‌యార్డు సమావేశపు హాలులో రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతన గార్గ్‌ ఆధ్వర్యంలో ఈయనను ఎన్నుకున్నారు.


పులివెందులకు షేక్‌ హఫీజుల్లా

పులివెందుల, జూలై 30: పులివెందుల మున్సిపాలిటీ వైస్‌ చైర్మన-2గా 10వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ హఫీజ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయ సభాభవనంలో పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండవ వైస్‌ చైర్మన ఎన్నిక నిర్వహించారు. 


రాయచోటికి ఫయాజుర్‌ రెహమాన్‌..

రాయచోటి, జూలై30: రాయచోటి మున్సిపల్‌ వైస్‌చైర్మన-2గా 9వ వార్డు కౌన్సిలర్‌ ఫయాజుర్‌ రెహమాన్‌ను ఎన్నుకున్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా ఆధ్వర్యంలో ఈయన ఎన్నిక జరిగింది.


ప్రొద్దుటూరుకు బంగారుమునిరెడ్డి..

ప్రొద్దుటూరు, జూలై 30 : ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌-2గా పాతకోట బంగారుమునిరెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భీమునిపల్లి లక్ష్మిదేవి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఈయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


మైదుకూరులో కౌన్సిలర్ల గైర్హాజరుతో..

మైదుకూరు, జూలై 30 : మైదుకూరు మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌-2 ఎంపిక శనివారానికి వాయిదా పడింది. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధికార పార్టీ కౌన్సిలర్లతో పాటు, జనసేన కౌన్సిలర్‌, ఎమ్మెల్యే, ఎంపీ హజరు కాకపోవడంతో శనివారానికి వాయిదా వేశారు.

Updated Date - 2021-07-31T05:11:28+05:30 IST