దూసుకొస్తున్న నిసర్గ

ABN , First Publish Date - 2020-06-03T07:23:45+05:30 IST

అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం మధ్యాహ్నం తీవ్ర తుఫానుగా మారింది. మంగళవారం రాత్రి ఇది అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌ ఈ తుఫానుకు నిసర్గ అని నామకరణం చేసింది...

దూసుకొస్తున్న నిసర్గ

  • తీవ్ర తుపాను అతి తీవ్రమయ్యే చాన్స్‌
  • మహారాష్ట్ర, గుజరాత్‌ తీరాలకు ముప్పు
  • ముంబై నగరాన్ని ముంచెత్తే ప్రమాదం
  • ఆస్పత్రి నుంచి కరోనా రోగుల తరలింపు

న్యూఢిల్లీ, జూన్‌ 2: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం మధ్యాహ్నం తీవ్ర తుఫానుగా మారింది. మంగళవారం రాత్రి ఇది అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌ ఈ తుఫానుకు నిసర్గ అని నామకరణం చేసింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన వాయుగుండం గుజరాత్‌లోని సూరత్‌కు 670 కి.మీ దూరంలో ఉంది. ఇది పెను తుఫానుగా మారి గంటకు 100-110కి.మీ వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది. ఈ తుఫాను బుధవారం సాయంత్రం పశ్చిమ మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ తీరాలను దాటే అవకాశం ఉంది. ఇది ముంబై నగరంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్‌ తీర ప్రాంతాల్లో 33 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి.‘‘తుఫానును ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సమాయత్తమవుతున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. నిసర్గ తుఫాను గనక వస్తే ముంబై చరిత్రలో ఈ మధ్య కాలంలో వచ్చిన మొదటి తుఫాను ఇదే అవుతుంది. 2009 నవంబరులో వచ్చిన ఫ్యాన్‌ తుఫాను నుంచి ముంబైకి త్రుటిలో ప్రమాదం తప్పింది. పాల్ఘర్‌ జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన 21 వేల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

Updated Date - 2020-06-03T07:23:45+05:30 IST