మన్మోహన్ సింగ్‌ను సూటిగా ప్రశ్నించిన నిర్మల సీతారామన్

ABN , First Publish Date - 2022-02-18T21:28:59+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన

మన్మోహన్ సింగ్‌ను సూటిగా ప్రశ్నించిన నిర్మల సీతారామన్

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సూటిగా ప్రశ్నించారు. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే మాట్లాడతారా? అని నిలదీశారు. మన్మోహన్ పరిపాలన కాలంలో విదేశీ పెట్టుబడులపై మితిమీరి ఆధారపడిన ఐదు దేశాల్లో ఒకటిగా భారత దేశానికి చెడ్డపేరు వచ్చిందన్నారు. 


మోర్గాన్ స్టాన్లీకి చెందిన ఓ ఫైనాన్షియల్ అనలిస్ట్ 2013 ఆగస్టులో ఫ్రాజిల్ ఫైవ్ అని ఐదు దేశాలను పిలిచారు. తమ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆధారపడటానికి వీలుకానటువంటి విదేశీ పెట్టుబడులపై మితిమీరి ఆధారపడినట్లు తెలిపారు. బ్రెజిల్, భారత దేశం, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, టర్కీ దేశాల ఆర్థిక వ్యవస్థలను ఫ్రాజిల్ ఫైవ్‌గా పేర్కొన్నారు. 


మన్మోహన్ సింగ్ గురువారం విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ ఆర్థిక, విదేశాంగ విధానాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన దేశ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోలేకపోతోందని విమర్శించారు. తప్పుడు ఆర్థిక విధానాల వల్ల దేశంలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరిందన్నారు. రైతులు, వ్యాపారవేత్తలు, మహిళలు, విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. ఈ వీడియో విడుదలైన కాసేపటికే నిర్మల సీతారామన్ విలేకర్ల సమావేశంలో స్పందించారు. 


మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా పని చేసిన కాలంలో భారత దేశాన్ని ఫ్రాజిల్ ఫైవ్ దేశాల జాబితాలోకి తీసుకెళ్ళారని నిర్మల సీతారామన్ ఆరోపించారు. 22 నెలలపాటు ఆయన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేకపోయారన్నారు. మన దేశం నుంచి మూలధనం ఎగిరిపోయిందన్నారు. అటువంటి (మాజీ) ప్రధాన మంత్రికి నేడు అకస్మాత్తుగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా గుర్తొచ్చిందని ప్రశ్నించారు. ఇదంతా పంజాబ్ శాసన సభ ఎన్నికల కోసమేనా? అని అడిగారు. అందరినీ కలుపుకొనిపోవడం గురించి ఆయన మాట్లాడారని, పంజాబ్‌లో టీకాలను లాభాలకు అమ్ముకుంటున్నపుడు ఆయన ఎందుకు మాట్లాడలేకపోయారని ప్రశ్నించారు. వ్యాక్సిన్లనేవి లాభాలు సంపాదించడం కోసం కాదని ఎందుకు చెప్పలేకపోయారని అడిగారు. ఆయనంటే తనకు చాలా గౌరవభావం ఉందని, అయితే ఇటువంటి వ్యాఖ్యలను ఆయన నుంచి తాను ఊహించలేదని చెప్పారు. 


కాంగ్రెస్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం టీకాలను ప్రైవేటు ఆసుపత్రులకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 



Updated Date - 2022-02-18T21:28:59+05:30 IST