జీఎస్‌టీ కౌన్సిల్ భేటీ ఈ నెల 28న

ABN , First Publish Date - 2021-05-15T23:37:24+05:30 IST

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కౌన్సిల్ సమావేశం ఈ నెల

జీఎస్‌టీ కౌన్సిల్ భేటీ ఈ నెల 28న

న్యూఢిల్లీ : వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కౌన్సిల్ సమావేశం ఈ నెల 28న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతుంది. న్యూఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. నిర్మల సీతారామన్ ఆఫీస్ అధికారిక ట్విటర్ ఖాతాలో శనివారం ఈ వివరాలను వెల్లడించారు. 


43వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం ఈ నెల 28న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతుందని, దీనికి నిర్మల సీతారామన్ నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని, ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపారు. 


ఇదిలావుండగా ఇటీవల జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించడం లేదంటూ ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా ఇటీవల నిర్మల సీతారామన్‌కు ఓ లేఖ రాశారు. జీఎస్‌టీ నష్టపరిహారం భర్తీ, తదితర అంశాలపై చర్చించేందుకు సత్వరమే జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించవలసి ఉన్నప్పటికీ, ఇప్పటికే రెండుసార్లు ఈ నిబంధనను ఉల్లంఘించారని ఆరోపించారు. కనీసం వర్చువల్ పద్ధతిలోనైనా ఈ సమావేశాన్ని నిర్వహించలేదని దుయ్యబట్టారు. 


Updated Date - 2021-05-15T23:37:24+05:30 IST