తొమ్మిదేళ్ల తర్వాత మెదడువాపు కలకలం
ABN , First Publish Date - 2022-08-19T05:29:49+05:30 IST
ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ల తర్వాత మళ్లీ మెదడువాపు వ్యాధి కేసు నమోదు కావడం కలకలం రేపింది.
కర్నూలు(హాస్పిటల్), ఆగస్టు 18: ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ల తర్వాత మళ్లీ మెదడువాపు వ్యాధి కేసు నమోదు కావడం కలకలం రేపింది. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా ఎనగొండ గ్రామంలో 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికకు మెదడు వాపు వ్యాధి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఐదు రోజుల క్రితం తీవ్ర జ్వరం, తలనొప్పితో బాధపడుతున్న బాలికను తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల చిన్నపిల్లల విభాగంలో చేర్పించారు. బాలిక స్పృహ లేకుండా ఉండటంతో పీడియాట్రిక్ విభాగపు హెచ్వోడీ డా.విజయ్ ఆనంద్బాబు ఆధ్వర్యంలో మెదడువాపు వ్యాధి అనుమానిత కేసుగా పీఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాలికకు జపనీస్ మేనింజైటిస్ట్ సిరాలజీ పరీక్షను మైక్రోబయాలజీకి పంపించగా.. ఏలిసా ఐజీఎం పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఎంఆర్ఐ బ్రెయిన్ పరీక్ష కూడా చేయగా, అందులోనూ బాలికకు జేఈ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో బాలికకు స్టెరాయిడ్, ఐవీ ఫ్లూయిడ్, యాంటిబయోటిక్ మెదడువాపును తగ్గించే మందులు ఇస్తున్నట్లు పీడీయాట్రిక్ హెచ్వోడీ తెలిపారు. 14 రోజులు వైద్యులు పర్యవేక్షణలో వైద్యం అందించనున్నట్లు తెలిపారు.
పెద్దాసుపత్రిలో ముందస్తు చర్యలు
కర్నూలు జీజీహెచ్ చిన్న పిల్లల విభాగంలో వనపర్తి జిల్లాకు చెందిన బాలికకు మెదడు వాపు ఏలిసా ఐజీఎం పాజిటివ్ కేసు నిర్ధారణ కావడంతో ఆసుపత్రిలో జిల్లా మలేరియా శాఖ అధికారి ఎ.నూకరాజు ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా చిన్నపిల్లల వార్డులు వాటి పరిసరాల ప్రాంతాల్లో యాంటి లార్వా, దోమలు లేకుండా స్ర్పే, ఫాగింగ్ చేపట్టారు. మెదడు వాపు వ్యాధి ప్రభలకుండా ఆసుపత్రిలోని నీటి నిల్వలను గుర్తించి అక్కడ దోమలు పెరగకుండా చర్యలు చేపట్టారు.