Uttarakhandలో నదిలో పడిన కారు...9మంది మృతి
ABN , First Publish Date - 2022-07-08T14:56:52+05:30 IST
ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....
డెహ్రాడూన్(ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.వేగంగా వస్తున్న ఓ కారు నదిలో పడి 9 మంది మరణించారు.ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లా రామ్నగర్ ప్రాంతంలో ఎర్టిగా కారు నదిలో పడిపోవడంతో తొమ్మిది మంది మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కారులో 11మంది ప్రయాణికులు ఉండగా, వారిలో ఓ చిన్నారిని పోలీసులు రక్షించారు.సంఘటన స్థలానికి ఉత్తరాఖండ్ పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. మృతులంతా పంజాబ్కు చెందిన వారేనని పోలీసులు చెప్పారు.కారులో 11 మంది ప్రయాణికులు ఉండగా వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. 9 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.
ధేలా గ్రామంలోని నదిలో బలమైన ప్రవాహం కారణంగా కారు నీటిలో కొట్టుకుపోయిందని పోలీసులు చెప్పారు.చనిపోయిన వారందరినీ గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కుమావోన్ రేంజ్ డీఐజీ నీలేష్ ఆనంద్ భర్నీ చెప్పారు.నదిలో గాయాలతో బయటపడిన ఒక బాలికను రామ్నగర్లోని ఆసుపత్రిలో చేర్చారు. రాంనగర్ కోట్ద్వార్ రోడ్డులోని కార్బెట్ నేషనల్ పార్క్లోని ఢెలా జోన్లో ఈ ప్రమాదం జరిగింది.‘‘శుక్రవారం ఉదయం 5 గంటలకు ఎర్టిగా కార్బెట్ వైపు వెళుతోంది. వేగంగా వెళ్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ధేలా గ్రామంలోని నదిలో బలమైన నీటి ప్రవాహం కారణంగా కారు నీటిలో కొట్టుకుపోయింది’’ అని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
ఈ నదిపై వంతెన నిర్మాణంపై పాలకవర్గంలో చర్చలు జరుగుతున్నాయని, గతంలో కూడా ఇక్కడ ఇలాంటి ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెప్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వర్షాకాలంలో పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. పలు రోడ్లపై కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు వాటిల్లుతున్నాయి.