అంత అప్పు చేసినా అభివృద్ధి శూన్యం: చిన్న రాజప్ప

ABN , First Publish Date - 2020-07-01T03:20:59+05:30 IST

చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి సరాసరి రూ.26వేల కోట్లు అప్పు చేస్తే.. జగన్ ప్రభుత్వం 13 నెలల్లోనే రూ.87వేల కోట్లు అప్పు చేసిందని మాజీ మంత్రి, టీడీపీ నేత చిన్న రాజప్ప ఆరోపించారు.

అంత అప్పు చేసినా అభివృద్ధి శూన్యం: చిన్న రాజప్ప

అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి సరాసరి రూ.26వేల కోట్లు అప్పు చేస్తే.. జగన్ ప్రభుత్వం 13 నెలల్లోనే రూ.87వేల కోట్లు అప్పు చేసిందని మాజీ మంత్రి, టీడీపీ నేత చిన్న రాజప్ప ఆరోపించారు. చంద్రబాబు కొద్దిపాటి అప్పు చేసి పెద్ద స్థాయిలో అభివృద్ధి చేయగా.. జగన్ పెద్ద మొత్తంలో అప్పు చేసినా అభివృద్ధి శూన్యమే అని విమర్శించారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం నెత్తిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.32వేల కోట్లు బకాయిలు పెట్టిందని అన్నారు. చంద్రబాబు గతాన్ని నిందించకుండా ఆదాయం పెంచి బకాయిలను తీర్చారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మాత్రం తమ చేతగాని తనాన్ని, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి బకాయిలపై పదే పదే అబద్దాలు మాట్లాడుతున్నారని చిన్న రాజప్ప దుయ్యబట్టారు. 


ఇళ్ల స్థలాల అవినీతిపై వైసీపీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులే ప్రభుత్వంపై విమర్శలు చేశారని ఆయన గుర్తు చేశారు. గృహ నిర్మాణంలో భారీ స్కామ్ చేయలేమనే ఉద్దేశంతోనే ఇళ్ల స్థలాల స్కీమ్ పెట్టారని ఆరోపించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసే ధైర్యం జగన్ ప్రభుత్వానికి ఉందా? అని చిన్న రాజప్ప సవాల్ విసిరారు. అంతర్జాతీయంగా అంబులెన్స్ సర్వీస్‌లో అనుభవమున్న సంస్థను తప్పించి, రేట్లు పెంచి అనుభవం లేని విజయసాయిరెడ్డి అల్లుడికి ఎందుకు కట్టబెట్టారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. రూ.307 కోట్ల అవినీతి జరిగితే విజయసాయిరెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు.

Updated Date - 2020-07-01T03:20:59+05:30 IST