‘రాజీనామా చేయమని నిమ్మగడ్డ ఆయనకు ఫోన్ చేశారు’
ABN , First Publish Date - 2020-05-31T03:49:25+05:30 IST
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం కుదింపు వ్యవహారంలో జగన్ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.
అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం కుదింపు వ్యవహారంలో జగన్ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్య శ్రీరామ్ మీడియా ముందుకొచ్చారు. శనివారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎస్ఈసీ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై వివరణ ఇచ్చారు.
రాజీనామా చేయమని ఫోన్ కాల్..!
‘ఎస్ఈసీలను నియమించే అధికారం ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా గల వ్యక్తికి లేదని హైకోర్టు చెప్పింది. ఇదే నిజమైతే 2016లో రమేష్ కుమార్ను నియమిస్తూ చేసిన ఉత్తర్వులూ చెల్లవు. ఇలాంటి సందిగ్ధత ఉంది కాబట్టే సుప్రీంకోర్టు వెళ్లాలని భావించాం. ఎస్ఈసీగా బాధ్యతలను స్వీకరించినట్టుగా నిమ్మగడ్డ రమేష్ జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవని భావిస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపున ప్రభాకర్ స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు. ఇవాళ ఉదయం 11గంటలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్... ప్రభాకర్కు ఫోన్ చేసి రేపటిలోగా రాజీనామా చేయమని కోరారు. ఎస్ఈసీలోకి కొత్త రక్తం ఎక్కించాలని వేరే స్టాండింగ్ కౌన్సిల్ నియమించుకుంటామని నిమ్మగడ్డ చెప్పారు. కొంత సమయం ఇవ్వాలని ప్రభాకర్...నిమ్మగడ్డను కోరినా ఒప్పుకోలేదు. ప్రభాకర్ నాకు ఫోన్ చేస్తే నిమ్మగడ్డ ఉత్తర్వులను పట్టించుకోనక్కర్లేదని చెప్పాను. అందుకే ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించాం’ అని అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యం చెప్పుకొచ్చారు.