నిఖత్‌కు జేజేలు

ABN , First Publish Date - 2022-05-28T04:44:54+05:30 IST

నిఖత్‌కు జేజేలు

నిఖత్‌కు జేజేలు
ఇషా, నిఖత్‌, సౌమ్యలతో మంత్రులు, శాట్స్‌ చైర్మన్‌


  • ఘన స్వాగతం పలికిన మంత్రులు
  • మూడు కి.మీ మేర ర్యాలీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతిక్రీడాప్రతినిది)/శంషాబాద్‌: అభిమానుల హర్షద్వానులు, కోలాహలం నడుమ బాక్సింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌ నిఖత్‌జరీన్‌ శుక్రవారం సాయంత్రం శంషాబాద్‌ విమానాశ్రయంలో అడుగు పెట్టింది. క్రీడాశాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, శాట్స్‌చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి ఆమెకు ఎదురెగి సాదర స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. నిఖత్‌ ఎంబీఏ అభ్యసిస్తున్న ఎంఎల్‌ఆర్‌ఐటీ కళాశాల నుంచి వంద మంది విద్యార్థులను తీసుకొని ఆ విద్యాసంస్థ చైర్మన్‌ మర్రి లక్ష్మణ్‌రెడ్డి అక్కడికి చేరుకుని ఆమెను అభినందించారు. ఇక, నిఖత్‌తో పాటు అదే సమయానికి విమానాశ్రయానికి చేరుకున్న స్టార్‌ షూటర్‌ ఇషాసింగ్‌, భారత ఫుట్‌బాలర్‌ సౌమ్యను కూడా మంత్రులు సన్మానించారు. అనంతరం ఈముగ్గురు ప్లేయర్లను తోలుకుని ఓపెన్‌ టాప్‌ జీప్‌లో సుమారు మూడు కిలోమీటర్ల మేర స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలో సమ్మర్‌ క్యాంప్‌ శిక్షణ తీసుకుంటున్న ఔత్సాహిక క్రీడాకారులు, హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థులు విమానాశ్రయం రోడ్డు దారి పొడువునా బారులు తీరి నిఖత్‌కు జేజేలు పలికారు. ఈకార్యక్రమంలో శాట్స్‌ ఇన్‌చార్జ్‌ వీసీ-ఎండీ సందీప్‌ కుమార్‌, డీడీలు సుజాత, ధనలక్ష్మి, చంద్రారెడ్డి, అడ్మినిస్ట్రేటర్లు నందకిషోర్‌ గోకుల్‌, రవి, కోచ్‌లు ఓంకార్‌ యాదవ్‌, నర్సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T04:44:54+05:30 IST