నైట్‌కర్ఫ్యూ నేపథ్యంలో బస్సులు, మెట్రో రైళ్ల సమయం కుదింపు

ABN , First Publish Date - 2021-12-29T17:24:52+05:30 IST

ఒమైక్రాన్‌ వైర్‌సను అడ్డుకునే దిశలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి నైట్‌కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చింది. రాత్రి 10 గంటల నుంచే ఇది అమలుకానున్న నేపథ్యంలో బస్సులు, మెట్రో రైళ్ల సంచారాన్ని

నైట్‌కర్ఫ్యూ నేపథ్యంలో బస్సులు, మెట్రో రైళ్ల సమయం కుదింపు

బెంగళూరు: ఒమైక్రాన్‌ వైర్‌సను అడ్డుకునే దిశలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి నైట్‌కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చింది. రాత్రి 10 గంటల నుంచే ఇది అమలుకానున్న నేపథ్యంలో బస్సులు, మెట్రో రైళ్ల సంచారాన్ని కుదించారు. ఉదయం 5 గం టల నుంచే సంచారాన్ని ప్రారంభించనున్న మెట్రో రైళ్లు రాత్రి 10 గంటల తర్వాత ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం మెజస్టిక్‌తో పాటు నాలుగు ప్రధాన మార్గాల స్టేషన్ల నుంచి రాత్రి 11 గంటలకు మెట్రో చివరి రైలు సంచరించనుంది. కాగా బీఎంటీసీ బస్సుల సంఖ్య కూడా రాత్రి 10 తర్వాత తగ్గిపోనుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని బీఎంటీసీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.


రేపటి నుంచి రెస్టారెంట్లు, పబ్‌లో 50 శాతం సీట్లకే అనుమతి 

కొవిడ్‌ అదనపు మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం ఈ నెల 30 నుంచి జనవరి 2 వరకు నగరమంతటా రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్‌లు, బార్లతో మొత్తం సామర్థ్యంలో కేవలం 50 శాతం సీట్లను మాత్రమే అనుమతిస్తారు. ఈ నియమాలను కట్టుదిట్టంగా పాటించాల్సిందేనని ఆ ప్రకటనలో స్పష్టంచేశారు. నియమాలను ఉల్లంఘించే వారిపై చర్యలు, జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు. కాగా రాత్రిపూట కర్ఫ్యూను మంగళవారం చాలా ప్రాంతాల్లో కాస్త కఠినంగానే అమలు చేశారు. తొలి రోజు కావడంతో పలు ప్రాంతాల్లో రాత్రి సంచరిస్తున్న వారిని హెచ్చరికలతో వదిలేశామని బుధవారం నుంచి కఠినంగా నియమాలు అమలవుతాయని నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్‌ మీడియాకు చెప్పారు. 


నేటి నుంచి ఫ్లై ఓవర్లు బంద్‌ 

నగరంలోని ఫ్లై ఓవర్లను బుధవారం నుంచి బంద్‌ చేయనున్నట్టు బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్‌ వెల్లడించారు. నగరంలో చెక్‌పోస్టులను పరిశీలించిన అనంతరం ఆయన నైట్‌ కర్ఫ్యూ గురించి వివరించారు. తొలుత మంగళవారం నుంచి మూసివేయాలని నిర్ధారించినా ప్రజల విజ్ఞప్తి మేరకు మంగళవారం మినహాయించినట్టు తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత పబ్‌, రెస్టారెంట్‌లు మూసివేయాల్సిందేనన్నారు. ఈనెల 31న కూడా నైట్‌ కర్ఫ్యూలో మార్పులు లేవన్నారు. కొత్త సంవత్సర వేడుకలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. బ్రిగేడ్‌ రోడ్డు, ఎంజీ రోడ్డు, కోరమంగల, ఇందిరానగర్‌ తదితర ప్రాంతాలలో అనవసరంగా సంచరించరాదన్నారు. కాగా రాత్రివేళల్లో విధులు నిర్వహించేవారు, ముందుగా ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకున్నవారు, అత్యవసర పనుల నిమిత్తం వెళ్లేవారికి, వైద్య చికిత్సలకు మాత్రమే అవకాశం ఉంటుందని, నాకాబంది కొనసాగిస్తున్నట్టు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-12-29T17:24:52+05:30 IST