BREAKING: ఏపీలో నైట్ కర్ఫ్యూ

ABN , First Publish Date - 2022-01-10T19:46:47+05:30 IST

కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

BREAKING: ఏపీలో నైట్ కర్ఫ్యూ

అమరావతి: కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను విధిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసింది. సోమవారం కోవిడ్ పరిస్థితులపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించాలని ఆదేశించారు. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలన్నారు. మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలని స్పష్టం చేశారు. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ ఆంక్షలు పాటించేలా చూడాలని అధికారులకు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకుండా చూడాలని సీఎం ఆదేశించారు. థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని...అలాగే  మాస్క్‌ తప్పనిసరి చేయాలన్నారు. దేవలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌ ధరించేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. 


కోవిడ్‌లో ఒమిక్రాన్‌ లాంటి కొత్త వేరియంట్‌ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఆ మేరకు హోం కిట్‌లో మార్పులు చేయాలన్నారు. వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధం చేయాలని సూచనలు చేశారు. అంతేకాక చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాలన్నారు. అవసరం మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలన్న ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 104 కాల్‌ సెంటర్‌ను బలంగా ఉంచాలని... ఎవరు కాల్‌చేసినా వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లను కూడా సిద్ధం చేయాలని చెప్పారు. నియోజకవర్గానికి ఒక కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కోవిడ్‌ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. 

Updated Date - 2022-01-10T19:46:47+05:30 IST