Matrimony లో పరిచయం.. నీకోసమే ఇండియాకు వచ్చానని అమ్మాయిని నమ్మించి.. ఎయిర్పోర్టులో...!
ABN , First Publish Date - 2021-09-02T20:31:24+05:30 IST
నీకోసం 400 పౌండ్స్ చెక్కును తెచ్చాను. కానీ...
హైదరాబాద్ సిటీ : యూరప్ యువతీ యువకుల ఫొటోలతో మ్యాట్రిమోని సైట్లలో నకిలీ ప్రొఫైల్స్ అప్లోడ్ చేసి.. పెళ్లి పేరుతో మోసం చేసి, రూ. లక్షలు దోచేస్తున్న ఆఫ్రికన్ సైబర్ నేరగాళ్లు ముగ్గురిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. సీపీ మహేష్ భగవత్ తెలిపిన వివరాలు.. ఆఫ్రికా దేశానికి చెందిన కెనాన్ ఎవరార్డ్, కంటేష్ మారి, సెర్జ్ ఒలివిర్, ఓవలాబి అబియోడమ్, ఓసాస్ ఫ్రీడో అనే ఆఫ్రికన్ యువకులు బిజినెస్ టూరిస్టు వీసాల కింద ఇండియాకు వచ్చి.. న్యూ డిల్లీలోని నిహార్ విహార్ ప్రాంతంలో ఉంటున్నారు. ఆఫ్రికాలో ఉంటున్న తమ స్నేహితులతో కలిసి సైబర్ నేరాలు చేస్తున్నారు. యూరప్ దేశాలకు చెందిన అందమైన యువతీ యువకుల ఫొటోలు డౌన్లోడ్ చేసి, ఏకేసీ అనే యాప్ ద్వారా వివిధ మ్యాట్రిమోనియల్ సైట్లలో ఆ ఫొటోలతో ఆరవ్ పేరుతో నకిలీ ప్రొఫైల్స్ పెట్టేవారు. వారితో పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటామని నమ్మించి.. రకరకాల కారణాలు చెప్పి బాధితుల నుంచి రూ. లక్షల్లో దోచేసేవారు. ఇటీవల రాచకొండ ప్రాంతానికి చెందిన ఒక యువతిని మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయం చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇదిలా ఉండగా.. ఒకరోజు ఆరవ్ ఫోన్ చేశాడు.
‘మ్యాట్రిమోని’ మోసగాడు వంశీకృష్ణపై మరోకేసు..
మ్యాట్రిమోని వెబ్సైట్లో తప్పుడు వివరాలు పెట్టి యువతులను మోసం చేస్తున్న కేటుగాడు వంశీకృష్ణపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీస్టేషన్లో మరో కేసు నమోదైంది. పలువురు యువతులకు మాయమాటలు చెప్పి, డబ్బు తీసుకున్న ఇతడిని రాచకొండ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్లో నివసించే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఓ మ్యాట్రిమోనీలో తన వివరాలు నమోదు చేసుకుంది. అదే వెబ్సైట్లో వంశీకృష్ణ తనకు సంబంధించి త ప్పుడు వివరాలు నమోదు చేసి యువతికి రిక్వెస్ట్ పెట్టాడు. అతడి ప్రొఫైల్ నచ్చడంతో ఆ యువతి చాటింగ్ చేసింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వంశీకష్ణ అమెరికా వచ్చేందుకు వీసా కోసం బ్యాంకు బ్యాలెన్స్ చూపాలంటూ రూ.22.70 లక్షలు తన ఖాతాలో జమ చేయించుకున్నాడు. అనంతరం ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. బాధితురాలు సైబర్క్రైం ఠాణాలో ఫిర్యాదు చేసింది.
అసలేం జరిగిందంటే..
‘నేను నీకోసం ఇండియాకు వచ్చాను. నన్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నీకోసం 400 పౌండ్స్ చెక్కును తెచ్చాను. కానీ దాన్ని కస్టమ్స్ అధికారులు ఫ్రీజ్ చేశారు. వివిధ క్లియరెన్స్ల కింద ఇండియన్ కరెన్సీలో రూ. 26..3లక్షలు చెల్లిస్తే వదిలేస్తామంటున్నా’రని నమ్మబలికాడు. నిజమేనని నమ్మిన బాధితురాలు అతను చెప్పిన ఖాతాలో డబ్బులు జమచేసింది. డబ్బులు తీసుకున్న అనంతరం ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. దీంతో యువతి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ శంకర్ ఏసీపీ హరినాథ్ పర్యవేక్షణలో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు. ఆఫ్రికాకు చెందిన నిందితులు డిల్లీ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. ముఠాలో ఐదుగురు ఉండగా.. వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.