నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలి

ABN , First Publish Date - 2022-07-06T03:28:48+05:30 IST

కందుకూరు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి

నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహీధరరెడ్డి.పక్కన ఆర్డీవో జీవీ సుబ్బారెడ్డి తదితరులు

  కందుకూరు, జూలై 5: కందుకూరు ఏరియా  ఆసుపత్రి అభివృద్ధి నిధుల వినియోగంలో  పారదర్శకత పాటించాలని  ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి కోరారు. మంగళవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు.  సమావేశానికి ఎమ్మెల్యే  అధ్యక్షత వహించగా, ఆర్డీవో జీవీ సుబ్బారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ యస్‌. మనోహర్‌, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.  సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. గత సమావేశంలో మెడికల్‌ బిల్లులకు సంబంధించి రూ.1,40,000 బిల్లు రిపీట్‌ కావటాన్ని  ఎమ్మెల్యే ప్రశ్నించారు.  ఆ బిల్లు పొరపాటున అజెండాలోకి వచ్చిందని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ వైద్యసేవల ద్వారా జమ అవుతున్న మొత్తాలను, యూజర్‌ చార్జీలు ద్వారా వస్తున్న మొత్తాలను, ఇతరత్రా వస్తున్న నిధుల వివరాలను వేర్వేరుగా సమావేశాలలో తెలియజేయటంతోపాటు ఖర్చుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. మందులు లేవని బయట కొనుగోళ్లను ప్రోత్సహించవద్దని ఆదేశించారు. అనస్తీషియా డాక్టరు నియామకం కోరుతూ సమావేశంలో తీర్మానం ఆమోదించారు.  డాక్టరు ఇంద్రాణి మాట్లాడుతూ ఆసుపత్రి రెండవ అంతస్తులో మరమ్మతుల కు చర్యలు తీసుకోవాలన్నారు.  ఆసుపత్రి ఆవరణలో జరుగుతున్న అదనపు భవనాల నిర్మాణం నాణ్యతతో జరిగేలా వైద్యాధికారులు, సిబ్బంది పర్యవేక్షించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సమావేశంలో  ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టరు శకుంతల, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-06T03:28:48+05:30 IST