దావూద్ ఇబ్రహీం భారీ కుట్రను బయటపెట్టిన ఎన్ఐఏ
ABN , First Publish Date - 2022-02-19T18:34:14+05:30 IST
విదేశాలకు పారిపోయిన గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం
న్యూఢిల్లీ : విదేశాలకు పారిపోయిన గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం భారత దేశంపై దాడి చేసేందుకు ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వెల్లడించింది. ఈ గ్యాంగ్స్టర్ హిట్ లిస్ట్లో భారత దేశ రాజకీయ నేతలు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నట్లు తెలిపింది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింసను రెచ్చగొట్టేందుకు ప్రాణాంతక ఆయుధాలు, పేలుడు పదార్థాలతో దాడులు నిర్వహించాలని కుట్ర పన్నినట్లు వివరించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేయడంతోపాటు ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలపై దావూద్ ఇబ్రహీం దృష్టి పెట్టినట్లు తెలిపింది. వివిధ మతాల మధ్య ఘర్షణలను సృష్టించాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను నమోదు చేసింది.
ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నట్లు ఆరోపిస్తూ ఇటీవల దావూద్ ఇబ్రహీం, తదితరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసును నమోదు చేసిన సంగతి తెలిసిందే. దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్, ఇతర అనుచరులను ఈడీ ప్రశ్నిస్తుంది. కోర్టు ఇక్బాల్ను ఫిబ్రవరి 24 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది.