రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతులపై మీ వైఖరేంటి?
ABN , First Publish Date - 2020-08-12T06:47:46+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమా లేదా అన్న అంశంపై వైఖరి ఏమిటో వారం రోజుల్లోగా తెలియజేయాలని కేంద్ర పర్యావరణ శాఖను జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది...
- వారంలోగా చెప్పాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఎన్జీటీ ఆదేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమా లేదా అన్న అంశంపై వైఖరి ఏమిటో వారం రోజుల్లోగా తెలియజేయాలని కేంద్ర పర్యావరణ శాఖను జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం ఎన్జీటీ న్యాయ సభ్యుడు కే రామకృష్ణన్, సభ్య నిపుణుడు సైబల్ దాస్గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
వాదనలు ముగిసిన అనంతరం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపించారు. ఇది కొత్త ప్రాజెక్టు కాదని, ఇప్పటికే గాలేరు నగరి, శ్రీశైలం ఎడమ కాలువతో పాటు ఇతర ప్రాజెక్టులకు అనుమతులున్నాయని వివరించారు. పాత ప్రాజెక్టులకే నీళ్లను తోడుకోవడానికి దీన్ని చేపడుతున్నామని తెలిపారు. ఇందులో అదనపు కాంపొనెంట్లు కూడా ఏమీ లేవని చెప్పారు. నిపుణుల కమిటీ కూడా దీనికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. కమిటీ నివేదికలో స్పష్టంగా తెలిపినందున పర్యావరణానికి సంబంధించి ఇకపై విచారణ అవసరం లేదని వాదించారు. కాబట్టి ఈ అంశంపై విచారణను ముగించాలని అభ్యర్థించా రు. అయితే, అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి సుప్రీం కోర్టులో, కృష్ణా ట్రైబ్యునల్లో విచారణ జరుగుతున్నదని అన్నారు. కాగా, పిటిషనర్ తరఫున న్యాయవాది కె.శ్రవణ్కుమార్ వాదనలు వినిపిస్తూ... పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 40 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుకున్నట్లు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఉందని అన్నారు. అంటే ప్రాజెక్టును విస్తరిస్తున్నారని, అదనపు కాంపొనెంట్లూ ఉన్నాయన్నారు. నిపుణుల కమిటీని ఏపీ ప్రభుత్వం తప్పదోవపట్టించినందున పర్యావరణ అనుమతులు అవసరం లేదని కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు.
శ్రీశైలం కాలువకు 37 ఏ ళ్ల క్రితం ఇచ్చిన పర్యావరణ అనుమతులు ఇప్పుడూ వర్తిస్తాయనడం సమర్థనీయం కాదని తెలిపారు. ఇప్పుడు చేపట్టే ప్రాజెక్టులు కొత్త ఈఐఏ నోటిఫికేషన్కు లోబడి చేపట్టాలని, కాబట్టి పర్యావరణ అనుమతులు అవసరమని తేల్చి చెప్పారు. తన వాదనతో కేంద్ర జలశక్తి, తెలంగాణ ప్రభుత్వం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, ఐఐటీ హైదరాబాద్ ఏకీభవిస్తున్నాయని, ఈ మేరకు అవి అఫిడవిట్ రూపంలో సమర్పించడం, కమిటీకి నివేదించడం చేశాయని తెలిపారు. వాదనల అనంతరం బెంచ్.. తీర్పును రిజర్వు చేసింది.