సీమ ఎత్తిపోతలకు అనుమతులపై మీ వైఖరేంటి?
ABN , First Publish Date - 2020-08-12T09:21:39+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు అవసరమో కాదో చెప్పాలని కేంద్ర పర్యావరణ శాఖను
- కేంద్ర పర్యావరణ శాఖకు ఎన్జీటీ ఆదేశం
- విచారణ ముగించాలని ఆంధ్రా వాదన
- పర్మిషన్ అవసరమేనన్న పిటిషనర్
- ట్రైబ్యునల్ తీర్పు వాయిదా
న్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు అవసరమో కాదో చెప్పాలని కేంద్ర పర్యావరణ శాఖను జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. వారం రోజుల్లో స్వతంత్రంగా వైఖరిని తెలియజేయాలని సూచించింది. ఈ ప్రాజెక్టును సవాల్ చేస్తూ తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం ట్రైబ్యునల్ న్యాయ సభ్యుడు కె.రామకృష్ణన్, సభ్య నిపుణుడు సైబల్ దాస్గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆంధ్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపించారు. ఇది కొత్త ప్రాజెక్టు కాదని, పాత ప్రాజెక్టులకే నీళ్లను తోడుకోవడానికి చేపడుతున్నామని, అందుచేత పర్యావరణ అనుమతులకు సంబంధించి ఇకపై విచారణ అవసరం లేదని.. ఈ అంశంపై విచారణను ముగించాలని అభ్యర్థించారు.
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 40 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుకున్నట్లు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఉందని.. అంటే ప్రాజెక్టును విస్తరిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. విస్తరణకు ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరమని స్పష్టం చేశారు. వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.