మరోసారి బ్లడ్ కేన్సర్
ABN , First Publish Date - 2021-05-05T04:45:23+05:30 IST
ఆటపాటలతో ఆనందంగా హాయిగా సాగిపోయే బాల్యంలో బ్లడ్ క్యాన్సర్ ఓ చిన్నారిని కమ్మేసింది. కూలి నాలి చేసుకునే తల్లిదండ్రులు వైద్యం చేయించారు. దాంతో ఆ గండం నుంచి బయటపడిన ఐదేళ్ల తర్వాత మరోసారి పగడవిప్పింది.
ప్రాణాపాయ స్థితిలో విద్యార్థి ప్రకాష్
దాతలు ప్రాణభిక్ష పెట్టాలని తల్లిదండ్రుల వేడుకోలు
నాయుడుపేట, మే 4 : ఆటపాటలతో ఆనందంగా హాయిగా సాగిపోయే బాల్యంలో బ్లడ్ క్యాన్సర్ ఓ చిన్నారిని కమ్మేసింది. కూలి నాలి చేసుకునే తల్లిదండ్రులు వైద్యం చేయించారు. దాంతో ఆ గండం నుంచి బయటపడిన ఐదేళ్ల తర్వాత మరోసారి పగడవిప్పింది. ప్రస్తుతం ఐటీఐ చదువుతున్న ఆ విద్యార్థి ప్రాణా పాయ పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పటికే ఉన్న ఇల్లు, కొద్దిపాటి పొలం అమ్ము కొని బిడ్డ వైద్యానికి ఖర్చుచేశారు. ప్రస్తుతం ఆ ఆ స్థోమత లేక ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తూ తమ బిడ్డకు ప్రాణబిక్ష పెట్టాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
నాయుడుపేట మండలం కూచివాడపాళెంకు చెందిన దంపతులు బల్లి రవి, సుజనమ్మ రైతు కూలీలు. వారి కుమారుడు ప్రకాష్ 6వ తరగతి చదువుతున్న సమయంలో బ్లడ్ క్యాన్సర్ను బారినపడ్డాడు. దాంతో వారికి ఉన్న ఇల్లు, కొద్దిపాటి పొలం అమ్మి కొడుకు వైద్యానికి దాదాపు రూ. 5 లక్షల ఖర్చుచేసి నయం చేసుకున్నారు. ఐటీఐ చదువుతున్న ప్రకాష్కు మళ్లీ బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్లు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని పలు ఆసుపత్రులను సంప్రదించగా వైద్యానికి దాదాపు రూ. 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారని బాధితులు అంటున్నారు. ప్రస్తుతం తమకు అంత ఆర్థిక స్తోమత లేనందున దాతలు కరుణించి తమ బిడ్డకు ప్రాణభిక్షపెట్టాలని వారు కోరుతున్నారు. సెల్నెంబరు 9652705123కు సంపద్రించాలని వారు కోరుతున్నారు.