తదుపరి సీజేఐ జస్టిస్ యూయూ లలిత్!
ABN , First Publish Date - 2022-08-05T06:39:49+05:30 IST
భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ 49వ సీజేఐగా జస్టిస్ లలిత్ పేరును ప్రతిపాదించారు.
ప్రతిపాదించిన జస్టిస్ ఎన్వీ రమణ
జస్టిస్ లలిత్ పదవీ కాలం 74 రోజులే!
చరిత్రాత్మక తీర్పుల్లో ఆయన పాత్ర కీలకం
న్యూఢిల్లీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ 49వ సీజేఐగా జస్టిస్ లలిత్ పేరును ప్రతిపాదించారు. గురువారం ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. న్యాయశాఖ ఆ లేఖను ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపనుంది. ఆయన ఆమోదముద్ర పడితే.. ఆ ప్రతిపాదన రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపడతారు. సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్ కానున్న సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫారసు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ ఎన్.వి.రమణ తర్వాత జస్టిస్ యు.యు.లలిత్ సీనియర్గా ఉన్నారు. జస్టిస్ లలిత్ ఆగస్టు 27న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే, ఆయన పదవీ కాలం మూడు నెలల్లోపే(74 రోజులు) ముగుస్తుంది. నవంబరు 8న ఆయన రిటైర్ అవుతారు.
దేశంలోనే తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్ తలాక్ సహా అనేక కీలక కేసుల్లో తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ లలిత్ ఉన్నారు. ట్రిపుల్ తలాక్ విధానంలో విడాకులు చెల్లుబాటు కావని, అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 2017లో 3-2 మెజారిటీతో తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ లలిత్ ఒకరు. కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ హక్కు ట్రావెన్కోర్ రాజకుటుంబానికి ఉంటుందని జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. పోక్సో చట్టం ప్రకారం.. చిన్నారుల జననాంగాలను ఉద్దేశపూర్వకంగా తాకితే.. అది లైంగిక దాడికిందకే వస్తుందంటూ సంచలన తీర్పునిచ్చారు.
జస్టిస్ లలిత్ ప్రస్థానమిది..
1957 నవంబరు 9న జన్మించిన జస్టిస్ లలిత్ తండ్రి యూఆర్ లలిత్ కూడా న్యాయవాదిగా.. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. జస్టిస్ లలిత్ జూన్ 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. డిసెంబరు 1985 వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. జనవరి 1986 నుంచి తన ప్రాక్టీస్ను సుప్రీంకోర్టుకు మార్చారు. 2004లో సీనియర్ న్యాయవాది హోదా సాధించారు. అనేక కేసుల్లో అమికస్ క్యూరీగా వ్యవహరించారు. క్రిమినల్ కేసులను వాదించడంలో దిట్టగా పేర్గాంచారు. ఆగస్టు 13, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.