న్యూయార్క్ నగరంలో అంగరంగ వైభవంగా 'నైటా' ప్రారంభం
ABN , First Publish Date - 2020-10-20T05:47:26+05:30 IST
అమెరికాలో అతిపెద్ద నగరమైన న్యూయార్క్లో తెలంగాణ చరిత్రకు, సాహిత్యానికి పట్టం కట్టేలా న్యూయార్క్
న్యూయార్క్: అమెరికాలో అతిపెద్ద నగరమైన న్యూయార్క్లో తెలంగాణ చరిత్రకు, సాహిత్యానికి పట్టం కట్టేలా న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్(నైటా) ప్రారంభమైంది. భావితరాలకు తెలంగాణా సాహిత్యం, చరిత్రను తెలియజేస్తూ, మరోవైపు కమ్యూనిటీకి సేవా కార్యక్రమాలను నిర్వహించేలా ఈ 'నైటా' ఉంటుందని వ్యవస్థాపక అధ్యక్షులు, శ్రీనివాస్ గూడూరు అన్నారు. ప్రపంచ ఆర్ధిక రాజధాని న్యూయార్క్ లాంగ్ ఐలాండ్లో జరిగిన సంఘం ప్రారంభ వేడుకల్లో వివిధ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా, కోలాహలంగా నిర్వహించారు. అక్టోబర్ 17న బతుకమ్మ/దసరా వేడుకలను ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించారు. కన్నుల పండువగా జరిగిన ఈ వేడుకల్లో కోవిడ్ నిబంధనలనుసరించి కొద్దిమందినే ఆహ్వానించారు.
మూడు నెలల క్రితం గూడూరు శ్రీనివాస్ గారి ఒక ఆలోచన పునాదిగా ప్రారంభమైన ఈ సంస్థ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా దినదిన ప్రవర్ధమానమవుతూ, తోడు నిలిచిన తోటి తెలంగాణావాదులు, శ్రీమతి ఉష మన్నెం, మల్లిక్ రెడ్డి అక్కినపల్లి, సహోదర్ పెద్దిరెడ్డి, పవన్ రవ్వల సహకారంతో ఒక పూర్తి స్థాయి సంస్థగా శరవేగంగా రూపుదిద్దుకుంది. వారికి అనుభవశాలురయిన డా. ఎ. రాజేందర్ జిన్నా(అమెరికన్ తెలుగు అసోసియేషన్ - ఆటా పూర్వ అధ్యక్షులు), లక్ష్మణ్ రెడ్డి ఏనుగు (తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం స్థాపకులు/పూర్వ అధ్యక్షులు), సామల ప్రదీప్ (నార్త్ అమెరికా తెలుగు సంఘం - నాటా స్థాపకులు/పూర్వ కార్యదర్శి), నాటా బోర్డు డైరెక్టర్ చిన్నబాబు రెడ్డి సలహాలతో, మార్గదర్శకత్వంలో నైటా మరింత మెరుగులు దిద్దుకుంది. ప్రారంభోత్సవ కోర్ కమిటీ సభ్యులు సర్వశ్రీ యోగి వనమ, రమ వనమ, అశోక్ చింతకుంట, కృష్ణశ్రీ గంధం, రంజీత్ క్యాతం, లింగా రెడ్డి గార్ల సహకారంతో ప్రారంభ వేడుకల ఏర్పాట్ల సంరంభం అదిరిపోయేలా సాగింది.
సాయంత్రం 8:00 గం లకు పండుగ, ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. ప్రార్ధనా గీతం, గణేశ పూజ, సంప్రదాయ బతుకమ్మ/బోనాల నృత్యాలు, అమ్మ వారి ప్రార్ధనలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు, శ్రీ శ్రీనివాస్ గూడూరు గారు ప్రసంగిస్తూ మూడు నెలల క్రితం ఈ ఆలోచనను వివిధ స్థానిక, జాతీయ తెలుగు సంస్థల నేతలతో చర్చించినపుడు వారు సుహద్భావంతో ఆశీర్వదించారన్నారు. నైటా ఐక్యమత్యానికి ప్రతీక అని చెపుతూ అన్ని సంస్థలతో స్పర్ధలు లేకుండా కలిసి పనిచేయడమే తమ సంస్థ ఆశయమన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ జాతీయ సంస్థల నేతలు హాజరై తమ అభినందనలు తెలియజేశారు. తెలంగాణా అమెరికన్ తెలుగు సంఘం వ్యవస్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డి, సలహామండలి అధ్యక్షులు డా. విజయపాల్ రెడ్డి, డా. హరనాథ్ పొలిచెర్ల, సభ్యులు మోహన్ పాటలోల్ల, తానా అధ్యక్షులు జయ శేఖర్ తాళ్ళూరి, ఆటా అధ్యక్షులు పరమేశ్ భీంరెడ్డి, లీడ్ ఇండియా(అమెరికా) అధ్యక్షులు డా. హరి ఇప్పనాపల్లి, నాటా పూర్వాధ్యక్షులు రాజేశ్వర్ గంగసాని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అన్నా రెడ్డి, వెంకట సుంకిరెడ్డి, ఆంజన్ కర్నాటి, టిఎల్సిఎ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నాగేందర్ గుప్తా, టిఎల్సిఎ పూర్వ అధ్యక్షులు తిరుమలరావు తిపిర్నేనిలు సంస్థ తన ఆశయాలను పాటిస్తూ సహచర సంస్థలతో ఐక్యమత్యంగా మెలగాలని సూచించారు.
టాటా అధ్యక్షుడు భరత్ మాదాడి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ మానాప్రగడ, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కో ఆర్డినేటర్ వెంకట్ ఎక్కా, టిడిఎఫ్ అధ్యక్షురాలు కవితా చల్లా, ఘంటసాల సంగీత కళాశాల అధ్యక్షులు మధు అన్న, తెలంగాణ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కవి, రచయిత అందె శ్రీ, గాయకులు/సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్, సినీ రచయిత/దర్శకులు డా. వడ్డేపల్లి కృష్ణ తమ దూర సందేశాలను పంపించి సంస్థ అభివృధ్ధిని ఆకాంక్షించారు. ఈ వేడుకలను స్పాన్సర్ చేసిన డా పైళ్ళ మల్లారెడ్డి గారికి, వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ గూడూరు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే దాతలు డా. హరి ఇప్పనపల్లి, సుమంత్ రామిశెట్టి, రఘురామ్ పన్నాలాకు కూడా శ్రీ శ్రీనివాస్ ధన్యవాదాలు చెప్పారు. ఓం డ్రగ్ డిపో అధినేతలు కుమార్ మరురీ, ప్రత్యూష గూడూరులు ఆహూతులందరికీ మాస్కులు, డిజిటల్ థర్మామీటర్, శానిటాయిజర్లు, పిపిఇ కిట్స్ను బహుమతులుగా అందజేశారు.
కుమారి కీర్తన తన నృత్యంతో మరిపించగా, యువ గాయకుడు ప్రణవ్ తన గానంతో వీనుల విందు చేశాడు. ప్రముఖ గాయకులు వరప్రసాద్, అదితిలు సినీ, తెలంగాణా, బతుకమ్మ పాటలతో ఉర్రూతలూగించారు. బీన్స్, పిస్తా హౌస్లు చక్కని వంటకాలు అందించారు. 2021 సంవత్సరానికి గాను, నైటా చైర్మన్గా డా. రాజిందర్ జిన్నా, వైస్ చైర్మన్గా లక్ష్మణ్ ఏనుగు, సతీష్ కల్వ, కృష్ణశ్రీ గంధంలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా, ప్రెసిడెంట్గా శ్రీమతి రమ వనమ, వైస్ ప్రెసిడెంట్గా అశోక్ చింతకుంట నియమితులయ్యారు. సంస్థ ఆశయాలకు అనుగుణంగా, అందరూ కలిసి సంస్థను బలోపేతం చేయడంతోపాటు కమ్యూనిటీకి మరింత సేవలందించేలా సంస్థను తయారు చేయాలని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గూడూరు కోరారు. చివరిగా శ్రీ పవన్ రవ్వ వందన సమర్పణ చేశారు.