- ధర పెరిగే అవకాశాలున్నాయని భావన
హైదరాబాద్ సిటీ : ఉప్పల్ భగాయత్ భూముల వేలంలో ఓ నాలుగు ప్లాట్లు అమ్ముడవ్వకపోవడంపై అధికారుల్లో ఆనందం నెలకొంది. తొలిరోజు ఈ-వేలంలో చదరపు గజానికి రూ. లక్ష చొప్పున ధర పలికింది. సగటున ఆ ధర రూ. 70 వేలుగా నమోదైంది. రెండోరోజు వేలంలో ప్లాట్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఫేజ్-3 లేఅవుట్లో చేసిన ఐదు పెద్దప్లాట్లు ఒక్కొక్కటి రెండు నుంచి ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిల్లో 61వ నంబరు ప్లాట్(11,277చ.గజాలు) ధర గజానికి రూ.36వేలుగా పలికింది.
మిగతా నాలుగు ప్లాట్లకూ ఇదే ధర వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. అదే జరిగితే హెచ్ఎండీఏకు భారీ నష్టమే. ఆ సంస్థ భారీగా ఆదాయాన్ని కోల్పోయేది. ఇదే విషయంపై అధికారుల్లో హైటెన్షన్ నెలకొని ఉండగా.. 50 వేల చదరపు గజాల్లో విస్తరించిన ఆ నాలుగు ప్లాట్లు అమ్ముడవ్వలేదు. వాటిని చిన్నప్లాట్లుగా చేసి వేలం వేస్తే అధిక ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.