మృత్యుఘోష

ABN , First Publish Date - 2020-08-02T10:24:23+05:30 IST

మృత్యుఘోష

మృత్యుఘోష

- జోగుళాంబ గద్వాల జిల్లాలో పెరుగుతున్న కరోనా మృతులు

- 12 మంది చనిపోయినట్లు చెబుతున్న వైద్యాధికారులు

- అనధికారికంగా దాదాపు 18 మంది చనిపోయినట్లు సమాచారం


గద్వాల క్రైం, ఆగస్టు 1 : కరోనా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో వైరస్‌ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 12 మంది మాత్రమే చనిపోయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నా, వాస్తవంగా మాత్రం దాదాపు 18 మంది వరకు చనిపోయినట్లు అనధికార సమాచారం ఉంది. ఇందులో జిల్లా కేంద్రంలోనే అధికంగా మరణాలు సంభవించినట్లు తెలుస్తున్నది. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో 432 కేసులు నమోదయ్యాయని, అందులో జిల్లా కేంద్రంలోనే 215 కేసులు ఉన్నట్లు చెబుతున్నారు. 12 మంది కరోనాతో మృతి చెందగా, అందులో గద్వాలలోనే 11 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ, అధికారుల లెక్కల్లోకి రాని కేసులు, మరణాలు మాత్రం రెట్టింపుగా ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 562 ఉండగా, 18 మంది వరకు కరోనాతో మృతి చెందినట్లు సమాచారం ఉంది. గద్వాలలోని కరోనా వార్డులో ప్రతి రోజూ ఒకరు లేదా ఇద్దరు చనిపోతూనే ఉన్నారు. అయితే, వైద్యాధికారులు మాత్రం ఈ విషయాన్ని బయటకు చెప్పడం లేదు. మూడు రోజులుగా గద్వాలలోని నల్లకుంటలో గురువారం ఓ మహిళ, శుక్రవారం రెవెన్యూ కాలనీలో ఓ రెవెన్యూ ఉద్యోగి, శనివారం సుంకులమ్మ కాలనీలో ఓ వ్యక్తితో పాటు మరొకరు మృతి చెందారు. అయినా అధికారులు మాత్రం తప్పుడు లెక్కలు చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2020-08-02T10:24:23+05:30 IST