టీఆర్ఎస్ అండతోనే ఇసుక మాఫియా ఆగడాలు
ABN , First Publish Date - 2020-08-02T10:25:45+05:30 IST
టీఆర్ఎస్ అండతోనే ఇసుక మాఫియా ఆగడాలు
- బీజేపీ నాయకురాలు డీకే అరుణ
- తిరుమలాపూర్ సంఘటనలో కేసును తారుమారు చేశారని ఆగ్రహం
మహబూబ్నగర్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : టీఆర్ఎస్ నేతల అండదండలతోనే ఇసుక మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయని బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిరుమలాపూర్లో ఇటీవల ఇసుక లారీ ఢీకొట్టి చనిపోయిన రైతు నరసింహులు కుటుంబాన్ని బీజేపీ నాయకులు బంగారు శ్రుతి, ఎర్రశేఖర్తో కలిసి శనివారం ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ తమ పొలాల గుండా ఇసుక లారీలు రావొద్దని అడ్డుకున్న నరసింహులును ఇసుకలారీతో తొక్కించిన కేసును టీఆర్ఎస్ నేతల ప్రోద్భలంతో తారుమారు చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ దందా సాగుతోందని ఆరోపించారు. ఈఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నరసింహులు సోదరుడు సైతం ఆరునెలల క్రితం ఇసుక దిబ్బలు కూలి చనిపోతే, అప్పట్లో రూ. 15 లక్షల పరిహారమిప్పిస్తామని టీఆర్ఎస్ నాయకులు హామీ ఇచ్చి, కేసులేకుండా చేశారని, ఇప్పటివరకు ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. తాజాగా నరసింహులు కుటుంబాన్ని సైతం రూ. 12 లక్షల పరిహారమిప్పిస్తామని మభ్యపెట్టి కేసును తారుమారు చేయాలని చూస్తున్నారన్నారు. ఇసుకతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే పదిరెట్ల ఆదాయం టీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళుతుందని, అడ్డుకునే పేదల ప్రాణాలను హరించి మరీ అక్రమ సంపాదన పోగేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల అండదండలతోనే టీఆర్ఎస్ నాయకులు ఈ దందా సాగిస్తున్నారని, వారికి షోకాజ్ నోటీసులు, మెమోలివ్వడం కాదని, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి బంగారు శ్రుతి మాట్లాడుతూ నరసింహులు కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారమివ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.