అప్పగింతల సమయంలో గుండెపోటుతో వధువు మృతి

ABN , First Publish Date - 2021-03-06T17:51:07+05:30 IST

ఒడిశాలోని సోన్‌పూర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

అప్పగింతల సమయంలో గుండెపోటుతో వధువు మృతి

సోన్‌పూర్: ఒడిశాలోని సోన్‌పూర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వివాహ తంతు ఆనందంగా పూర్తయ్యాక, అప్పగింతల సమయంలో వధువు గుండెపోటుతో మృతి చెందింది. తనను అత్తవారింటికి పంపిస్తున్నారని వధువు ఏకధాటిగా రోదించింది. ఇది ఆమె గుండెపై తీవ్ర ప్రభావం చూపింది. వివరాల్లోకి వెళితే సోన్‌పూర్‌లో శుక్రవారం జులండా గ్రామానికి చెందిన మురళీ సాహు కుమార్తె రోజీకి టెటల్ గ్రామానికి చందిన బిసీకేసన్‌తో వివాహం జరిగింది. 


అప్పగింతల సమయంలో తాను పుట్టింటిని విడిచిపెట్టాల్సి వస్తుందని వధువు ఏడుస్తూ స్పృహ తప్పి కిందపడిపోయింది. వెంటనే బంధువులు ఆమెను డూంగురిపాలీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడి వైద్యులు వధువును పరీక్షించి, ఆమె గుండెపోటుతో చనిపోయిందని తేల్చిచెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని, వధువు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. వధువు మృతి చెందిందన్న వార్త తెలియగానే స్థానికంగా విషాదం నెలకొంది. 

Updated Date - 2021-03-06T17:51:07+05:30 IST