కొత్తగా రెక్కలొచ్చెనా...
ABN , First Publish Date - 2021-07-26T07:13:22+05:30 IST
ఇవి ప్రతి ఏటా జిల్లాలోని ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు చిలమత్తూరు మండలం వీరాపురానికి వస్తాయి.
స్వస్థలాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్న పెయింటెడ్ స్టార్క్స్
ఆ అతిథులకు కరోనా నిబంధనలు లేవు
దేశం దాటి దేశం వెళ్లటానికి వీసా అక్కర్లేదు
అధికారుల అనుమతి అవసరమే లేదు
పుట్టింటికి వచ్చే పడతుల్లా
మేఘాల అలలపై
శీతల ప్రాంతం నుంచి
వాగులు వంకలు, కొండలు కోనలు
రాష్ర్టాలు, దేశాలు దాటుతూ
వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చే విహంగాలు అవి
పండితులు పెయింటెడ్ స్టార్క్స్ అంటారు
పామరులు ఎర్రకాళ్ల కొంగలు అంటారు
ఇక్కడి చెట్లపై గూళ్లు కట్టి, గుడ్లుపెట్టి
సంతానోత్పత్తి చేసే విదేశీ రాయబారులు
అందమైన రెక్కలతో నీళ్లపై ఎగురుతూ,
చెట్లపై వాలుతూ స్థానికులకు ఆనందానుభూతిని కలిగిస్తాయి.
తమ పిల్లలకు ఎగిరే శక్తి రాగానే వాటి స్వస్థలాలకు వెళ్లిపోతాయి.
ఇవి ప్రతి ఏటా జిల్లాలోని ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు చిలమత్తూరు మండలం వీరాపురానికి వస్తాయి. ఈఏడా ది కూడా జనవరి చివరి, ఫిబ్రవరి మొదటి వారంలో వేల సంఖ్యలో పక్షులు వీరాపురం, వెంటాపురం గ్రామాలకు వచ్చాయి. ఆరు నెలల పాటు ఇక్కడే గుంపులుగా విడిది చేసి రావి, వేప, చింత తదితర చెట్లపై గూడుకట్టి, గుడ్లు పెట్టి పొదిగి సంతానోత్పత్తి చేశాయి. ప్రస్తుతం పిల్లలకు ఎగిరే శక్తి రావడంతో పిల్లలు కొత్త రెక్కలు తొడిగి ఆకా శంలో చక్కర్లు కొడుతూ చెరువుల్లో గుంపులు గుంపులు సంచరిస్తున్నాయి. జూలై మాసం ముగింపునకు రావడం తో ఆగస్టు మొదటి వారంలో స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు పక్షులు సన్నద్ధం అవుతున్నట్లు కన్పిస్తోంది.
- హిందూపురం