రాష్ట్రంలో మరణ మృదంగం
ABN , First Publish Date - 2021-05-09T08:21:11+05:30 IST
రాష్ట్రంలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. సెకండ్ వేవ్లో అత్యధికంగా ఒక్కరోజులో 96 మరణాలు శనివారం నమోదయ్యాయి. 24గంటల వ్యవధిలో 1.01,571 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 20,065మందికి పాజిటివ్ నిర్థారణైందని ఆరోగ్యశాఖ
కొత్తగా 96 మంది మృతి
సెకండ్ వేవ్లో ఇదే అత్యధికం
కొత్తగా 20,065 మందికి పాజిటివ్
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్)
రాష్ట్రంలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. సెకండ్ వేవ్లో అత్యధికంగా ఒక్కరోజులో 96 మరణాలు శనివారం నమోదయ్యాయి. 24గంటల వ్యవధిలో 1.01,571 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 20,065మందికి పాజిటివ్ నిర్థారణైందని ఆరోగ్యశాఖ తెలిపింది. విశాఖలో 2,525, తూర్పుగోదావరి 2,370, చిత్తూరు 2,269, అనంత 1,741, గుంటూరు 1,663, నెల్లూరు 1,515, కర్నూలు 1,421, శ్రీకాకుళం 1,398, కడప 1,178, కృష్ణా 1,127, పశ్చిమగోదావరి 1,125, ప్రకాశం 1,083, విజయనగరంలో 650 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 12,65,439కు, మరణాల సంఖ్య 8,615కు చేరింది. తాజాగా పశ్చిమగోదావరిలో 14, విశాఖ 12, అనంతపురం 10, గుంటూరు 10, తూర్పుగోదావరి 9, విజయనగరం 9, కర్నూలు 7, నెల్లూరు 7, చిత్తూరు 6, కడప 5, కృష్ణా 4, శ్రీకాకుళంలో ముగ్గురు మరణించారు.
పురుగుమందు తాగి ఆత్మహత్య..
తగిన చికిత్స అందడం లేదని కరోనా బాధితుడు మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా వేమూరు మండలం కాకర్లమూడికి చెందిన చందు సురేష్(34) గత నెల 30న కొవిడ్ పరీక్ష చేయించుకోగా ఈనెల 2న పాజిటివ్గా రిపోర్టు వచ్చింది. 3న తెనాలి సమీప జగ్గడిగుంటపాలెం క్వారంటైన్ సెంటర్లో చేరి చికిత్స పొందుతున్నారు. అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలోని పొలాల్లో అతని మృతదేహాన్ని గుర్తించారు. తనకు సరిగా వైద్యం అందటం లేదన్న మనస్తాపంతో ఆయన పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
విమానం అత్యవసర ల్యాండింగ్
గన్నవరం, మే 8: విమానంలో ప్రయాణికురాలు అస్వస్థతకు గురవడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసి ఆస్పత్రికి తరలించారు. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురికి ఇండిగో విమానం శనివారం బయలుదేరింది. ప్రయాణికురా లు అగర్వాల్(49) ఊపిరాడటం లేదని చెప్పటంతో పైలెట్ గన్నవరం(విజయవాడ) విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వైద్య సిబ్బంది ఎయిర్పోర్టు అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్తో విమానం వద్దకు వచ్చారు. ఆమెకు ఆక్సిజన్ అందించి ఆస్పత్రికి తరలించారు.