Gandhi ఆస్పత్రిలో సరికొత్త సేవలు.. ఇక 24/7..
ABN , First Publish Date - 2022-04-28T11:46:35+05:30 IST
Gandhi ఆస్పత్రిలో సరికొత్త సేవలు.. ఇక 24/7..
- ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్
- అన్ని విభాగాల వైద్యులూ ఒకే చోట
- గాంధీ ఆస్పత్రిలో సరికొత్త సేవలు
హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు గాంధీ ఆస్పత్రిలో మరో ప్రత్యేక విభాగం అందుబాటులోకి రానుంది. ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్ (ఈఎండీ) పేరుతో ఏర్పాటు చేసిన ఈ విభాగంలో ఆర్థో, అనస్తీషియా, గ్యాస్ర్టో, న్యూరో, యూరాలజీ, ట్రామా.. ఇలా ముఖ్యమైన విభాగాల వైద్యులు అందుబాటులో ఉంటారు. వచ్చే నెల ఒకటిన ఈఎండీని ప్రారంభిస్తున్నట్లు సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని క్వాజువాలిటీ వార్డుకు తీసుకొస్తే ఆర్థో, అనస్తీషియా వైద్యులకు ఫోన్ చేసి పిలిపించే వారు. దీంతో వైద్యం అందడంలో జాప్యం జరిగేది. ఇకపై అలాంటి పరిస్థితులు లేకుండా అన్ని విభాగాలకు చెందిన వైద్యులు ఈఎండీలో అందుబాటులో ఉంటారు. క్షణాల్లో అన్ని రకాల చికిత్సలూ ఇక్కడ లభిస్తాయి. ఈఎండీ విభాగంలో కార్పొరేట్ తరహాలో సేవలు అందుతాయని, 24/7 అన్ని విభాగాలకు చెందిన వైద్యులూ అందుబాటులో ఉంటారని తెలిపారు.