ముగిసిన మూడో రోజు ఆట.. ఓటమి అంచున కివీస్

ABN , First Publish Date - 2021-12-05T23:05:52+05:30 IST

భారత్‌‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఓటమి అంచున నిలిచింది. భారత్ నిర్దేశించిన 540 పరుగుల

ముగిసిన మూడో రోజు ఆట.. ఓటమి అంచున కివీస్

ముంబై: భారత్‌‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఓటమి అంచున నిలిచింది. భారత్ నిర్దేశించిన 540 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. హెన్రీ నికోలస్ 36, రచిన్ రవీంద్ర 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. బ్లాక్ క్యాప్స్ విజయానికి ఇంకా 400 పరుగులు అవసరం కాగా, భారత్‌కు ఐదు వికెట్లు చాలు. ఈ నేపథ్యంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప టీమిండియా విజయం నల్లేరు మీద నడకే కానుంది.


అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 69/0తో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 276/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుంటే భారత్ లీడ్ 540 పరుగులకు పెరిగింది. అనంతరం భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్‌కు 13 పరుగుల వద్ద తొలి దెబ్బ తగిలింది. ఓపెనర్ టామ్ లాథమ్ (6)ను అశ్విన్ పెవిలియన్ పంపాడు.


అది మొదలు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ పరాజయానికి మరింత చేరువైంది. డరిల్ మిచెల్ మాత్రం భారత బౌలర్లను కాసేపు నిలువరించి 60 పరుగులు చేయగలిగాడు. విల్ యంగ్ 20 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు తీసుకోగా, అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ లభించింది.

Updated Date - 2021-12-05T23:05:52+05:30 IST