న్యూజిలాండ్ కీలక నిర్ణయం.. భారతీయులు ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు..!
ABN , First Publish Date - 2021-11-18T19:34:59+05:30 IST
భారత్లో ఉత్పత్తి అవుతున్న కరోనా వ్యాక్సిన్ల విషయంలో న్యూజిలాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ టీకాకు, భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్కు న్యూజిలాం
ఎన్నారై డెస్క్: భారత్లో ఉత్పత్తి అవుతున్న కరోనా వ్యాక్సిన్ల విషయంలో న్యూజిలాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ టీకాకు, భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్కు న్యూజిలాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్లోని భారత హైకమిషనర్ ముక్తేష్ ప్రదేశీ బుధవారం రోజు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘న్యూజిలాండ్ పాజిటివ్ నిర్ణయం తీసుకుంది. కోవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను గుర్తింపు పొందిన టీకాల జాబితాలో చేర్చింది. ప్రయాణ ఆంక్షలు ఎత్తేయడం గురించిన ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాం. వ్యాక్సిన్ తీసుకున్న టూరిస్ట్లకు భారత్ ఇప్పటికే స్వాగతం తెలుపుతోంది’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా.. న్యూజిలాండ్ నిర్ణయంతో రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న భారత ప్రయాణికులకు క్వారెంటైన్ బాధలు తప్పనున్నాయి. ఇదిలా ఉంటే.. కొవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే.