న్యూయార్క్లో అద్భుతం.. నాలుగు నెలల్లో మొట్టమొదటిసారిగా..
ABN , First Publish Date - 2020-07-14T00:05:47+05:30 IST
కరోనాకు ఒకప్పుడు కేంద్రంగా ఉన్న న్యూయార్క్ నగరం ఇప్పుడు మహమ్మారిని జయించింది.
న్యూయార్క్: కరోనాకు ఒకప్పుడు కేంద్రంగా ఉన్న న్యూయార్క్ నగరం ఇప్పుడు మహమ్మారిని జయించింది. న్యూయార్క్ నగరంలో నాలుగు నెలల తరువాత మొట్టమొదటి సారిగా ఒక్కరు కూడా కరోనా కారణంగా మరణించలేదని ఆదివారం వెల్లడైన లెక్కలు చెబుతున్నాయి. న్యూయార్క్ నగరంలో మొదటి కరోనా మరణం మార్చి 11న నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు న్యూయార్క్లో నిత్యం కరోనా కారణంగా అనేక మంది మరణిస్తూనే వచ్చారు. ఏప్రిల్ 9న అత్యధికంగా ఒకేరోజు 799 మంది మరణించారు. అలాంటి న్యూయార్క్ నగరంలో ఇప్పుడు ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడంతో న్యూయార్క్ ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇది న్యూయార్క్ నగర ప్రజల పోరాట ఫలితమేనని ప్రభుత్వం అంటోంది. న్యూయార్క్ నగరంలో ఇప్పటివరకు 18,670 మంది మరణించారు. మరో 4,613 మంది సహజంగా మరణించినప్పటికి వారు కూడా కరోనా కారణంగానే మరణించినట్టు సమాచారం.
మరోపక్క న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. నిత్యం 70 వేల శాంపిల్స్ను పరీక్షిస్తోంటే ఒక శాతానికి అటు ఇటుగానే పాజిటివ్ రేట్ ఉంటోంది. కాగా.. న్యూయార్క్లో ఇప్పటివరకు మొత్తంగా 4,27,638 కేసులు నమోదుకాగా.. 32,403 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇదిలా ఉంటే.. అమెరికాలోని మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అరిజోనా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్ రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారిపోయాయి. అమెరికాలో ఇప్పటివరకు 33 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరోపక్క కరోనా కారణంగా అమెరికాలో లక్షా 36 వేలకు పైగా మరణించారు. అమెరికాలో ఇప్పటికే అనేక రాష్ట్రాలు తిరిగి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించేందుకు సిద్దమయ్యాయి.