కలకలం సృష్టించిన వ్యాపారి హత్య కేసులో కొత్త కోణాలు!

ABN , First Publish Date - 2021-03-13T13:08:59+05:30 IST

వనస్థలిపురంలో కలకలం సృష్టించిన వ్యాపారి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి....

కలకలం సృష్టించిన వ్యాపారి హత్య కేసులో కొత్త కోణాలు!

  • ఆస్తి కోసమే హత్య?
  • పెళ్లికి ముందు  ఒప్పందాన్ని తిరస్కరించడంతో..
  • కేసు పక్కదారి పట్టించేందుకు లైంగిక దాడి ఆరోపణ

హైదరాబాద్/వనస్థలిపురం : వనస్థలిపురంలో కలకలం సృష్టించిన వ్యాపారి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి ముందు భర్తతో ఆస్తి విషయంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ముగ్గురు కూతుళ్ల వివాహానికి ఆస్తి ఇచ్చేందుకు నిరాకరించటంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కేసు తప్పుదోవ పట్టించేందుకు తన పిల్లలపై లైంగిక దాడికి ప్రయత్నించినట్టు ఆరోపించింద ని తెలుస్తోంది. పోలీసుల ముందు ప్రియుడైన సునీల్‌ తివారిని ‘భయ్యా’ అని సంబోధించి తప్పుదోవ పట్టిస్తోంది.  ప్రియుడితో కలిసి రెండో భర్త, వ్యాపారి గగన్‌ అగర్వాల్‌ను నౌసిన్‌ బేగం హత్య చేసిన సంగతి తెలిసిందే.


నౌసిన్‌ బేగం తీరుపై అనుమానాలు?

నౌసిన్‌ బేగం తీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. తనను కిడ్నా్‌పకు ప్రయత్నిస్తున్నారని, తల వెంట్రుకల్ని కట్‌ చేశారని సొంత పనుల మీద రెండ్రోజుల పాటు బయటికి వెళ్లిన భర్తకు సమాచారం ఇచ్చింది. ఇంటికి వచ్చిన భర్తకు అలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో నౌసిన్‌ బేగం వ్యవహారంపై అనుమానం వచ్చి ఆమెపై కన్నేశాడు. తన మిత్రుడు సునీల్‌ తివారిపైనా కన్నేసినట్లు తెలుస్తోంది. తన మిత్రుడు నౌసిన్‌బేగంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానించాడు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసైన గగన్‌ అగర్వాల్‌, భార్యతో తరచూ గొడవ పడేవాడు. అలాగే, ఆస్తిలో వాటా ఇచ్చేందుకు తిరస్కరించినట్లు తెలుస్తోంది.


పక్కా ప్లాన్‌తో..

నౌసిన్‌ బేగంభర్తను హత్య చేసేందుకు పక్కా ప్లాన్‌ వేసినట్లు తెలుస్తోంది. గతనెల 7న ప్రియుడు సునీల్‌ తివారితో కలిసి హత్య చేసింది. అర్ధరాత్రి మద్యం మత్తులో గగన్‌ అగర్వాల్‌ను ప్రియుడు సునీల్‌ తివారి గట్టిగా పట్టుకున్నాడు. ముందుగా భర్త గొంతులో కత్తి దింపిన నౌసిన్‌ బేగం తర్వాత ఛాతీ కుడిభాగంతో కలిపి మొత్తం ఐదుసార్లు కత్తితో పొడించింది. దీంతో గగన్‌ అగర్వాల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అద్దెకు ఉన్న వారికి అనుమానం రాకుండా రాత్రి 2.:30 గంటల ప్రాంతంలో ప్రియుడు సునీల్‌ తివారి సహయంతో మృతదేహాన్ని సెప్టిక్‌ ట్యాంక్‌ కోసం తీసిన గుంతలో పూడ్చింది. 


బెడిసి కొట్టిన ప్లాన్‌

గత నెల 11,12 తేదీల్లో గగన్‌ అగర్వాల్‌ సోదరి కూతురి వివాహం జరిగింది. అయితే, నౌసిన్‌బేగం పెద్ద కూతురుకి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువకుడి మొబైల్‌ నుంచి గగన్‌ అగర్వాల్‌ పేరిట పెళ్లికి హాజరు కాలేనని కుటుంబ సభ్యులకు పంపిన మెసేజ్‌తో నౌసిన్‌బేగంపై ఒత్తిడి పెరిగింది. దీంతో చేసేదేం లేక మృతుడి సోదరుడు ఆకాశ్‌ అగర్వాల్‌తో కలిసి ఫిబ్రవరి 18న ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎల్‌బీనగర్‌ పోలీసులు కేసును వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌కు బదలాయించారు. భర్త హత్య అనంతరం కొన్ని రోజుల పాటు పాతబస్తీలో ఉన్న కుటుంబ సభ్యుల వద్ద ఉంది. పోలీసు దర్యాప్తు ముమ్మరం చేయటంతో ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి ఢిల్లీ వెళ్లింది. అక్కడి నుంచి రాజస్థాన్‌ అజ్మీర్‌ దర్గాకు వెళ్లింది. అక్కడి నుంచి మరో ఫోన్‌ నంబర్‌తో కుటుంబ సభ్యులకు తరచూ ఫోన్‌ చేసేది. కుటుంబ సభ్యుల సహకారంతో ఫోన్‌సిగ్నల్‌ ఆధారంగా, నౌసిన్‌బేగంను ఫిలించి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Read more