సినిమా వివాదంలో కొత్త ట్విస్ట్
ABN , First Publish Date - 2021-09-29T20:08:32+05:30 IST
ఏపీ ప్రభుత్వం, వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి.
అమరావతి: ఏపీ ప్రభుత్వం, వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. అయితే సినిమా వివాదంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. పవన్, మంత్రి పేర్నినాని మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సమయంలోనే మచిలీపట్నంలో ఉన్న మంత్రి పేర్ని నాని దగ్గరకు నిర్మాతలు దిల్ రాజు డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు వెళ్లారు. మంగళవారం మంత్రికి ఫోన్ చేసి నిర్మాతలు వస్తారని మధ్యవర్తులు చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం మచిలీపట్నంలో ఉన్న మంత్రి నివాసానికి నిర్మాతలు చేరుకున్నారు. తాజా వివాదంపై నిర్మాతలు చర్చించనున్నారు. ఇటీవల పవన్, పేర్ని నాని మధ్య మాటల తూటాల నేపథ్యంలో మంత్రి దగ్గరకు నిర్మాతల బృందం వెళ్లడం చర్చనీయాంశమైంది.
సినిమా రంగ సమస్యలను ప్రస్తావిస్తూ జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ఏపీ సర్కారుపైనా, మంత్రి పేర్ని నానిపైనా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై పేర్ని నానితోపాటు పలువురు మంత్రులు ఘాటుగా స్పందించారు. దీంతో పవన్ కూడా ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఇక పవన్ వర్సెస్ వైసీపీ నేతల మధ్య జరుగుతున్న వార్కి సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి మరింత ఆజ్యం పోశారు. ఈసారి ఆయన పవన్ కల్యాణ్పై బూతులతో విరుచుకుపడ్డారు. దీంతో ఈ వ్యవహారం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే పవన్ ఏపీలో కృష్ణా, గుంటూరు జిల్లాల పర్యటనకు పూనుకున్నారు.