దత్తపుత్రుడు.. పెంపుడు తల్లిని చంపిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

ABN , First Publish Date - 2022-05-12T15:35:48+05:30 IST

దత్తపుత్రుడు.. పెంపుడు తల్లిని చంపిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

దత్తపుత్రుడు.. పెంపుడు తల్లిని చంపిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

  • మత్తు కోసం దారుణం
  • పోలీసుల అదుపులో దత్తపుత్రుడు
  • హత్యలో ఐదుగురి ప్రమేయం
  • పరారీలో సూత్రధారి, పాత్రధారి

హైదరాబాద్ సిటీ/దిల్‌సుఖ్‌నగర్‌ : న్యూ గడ్డిఅన్నారంలో పెంపుడు తల్లిని చంపిన కేసులో దత్తపుత్రుడు, అతడికి సహకరించిన మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మత్తు కోసమే దత్తపుత్రుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. అతడిని పావుగా వాడుకొని నగలు, నగదు చోరీకి పథకం వేసిన సూత్రధారితోపాటు హత్యలో పాల్గొన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


రెండు నెలలుగా.. 

నిందితులు దత్తపుత్రుడు సాయితేజతో కొన్ని నెలలుగా స్నేహం చేసి మత్తు పదార్థాలు అలవాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో నగలు, నగదు గురించి ఆరా తీశారు. సాయితేజకు పెళ్లి చేసేందుకు నిశ్చయించుకున్న జంగయ్య యాదవ్‌, భూదేవి దంపతులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు రెండు నెలల క్రితం రూ.10 లక్షలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన విషయం తెలుసుకున్నారు. అప్పటి నుంచే చోరీకి పథకం రూపొందించినట్లు తెలుస్తోంది. అదును చూసి గత శనివారం పథకాన్ని అమలు చేశారు. బీరువా తాళాలు తీసుకునే సమయంలో నిద్రలేచిన భూదేవిని ఊపిరాడకుండా హతమార్చినట్లు తెలిసింది.


సాయితేజతోపాటు మరో నలుగురు హత్యలో పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి న్యూ గడ్డిఅన్నారం పరిసరాల్లో మకాం వేసిన నిందితులు రెండు బైక్‌లను ఉపయోగించినట్లు సమాచారం. ఒక బైక్‌పై వచ్చిన ఇద్దరు భూదేవి ఇంటి వెనుకవైపు బైక్‌ పార్క్‌ చేసి వెనుక గోడ దూకి పై అంతస్తుకు చేరుకోగా, మరో ఇద్దరు ఇంటి ముందు వైపు వీధి చివర్లో ఆగినట్లు సమాచారం. తెల్లవారు జామున సుమారు 3 గంటల సమయంలో భూదేవిని హతమార్చిన దుండగులిద్దరు వెనుక నుంచి పారిపోయారు. సాయితేజ నగలు, నగదు బ్యాగ్‌ తీసుకొని 3.12 గంటలకు ఇంటి ముందు వైపు ఉన్న వారికి ఇచ్చాడు. హత్యకు ఉపయోగించిన దిండును మరిచిపోవడంతో తిరిగి 3.17 గంటలకు ఇంట్లోకి వచ్చి దిండు తీసుకుని 3.27 గంటలకు వెళ్లిపోయాడు. సాయితేజను పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Read more