సాగుకు కొత్త దిశ

ABN , First Publish Date - 2020-05-23T07:59:35+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా ఏటికేడు పరిస్థితులు మారుతుంటాయి. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సాగుచేసే పంటలను కూడా

సాగుకు కొత్త దిశ

  • పునాస నుంచే సంస్కరణల శకం.. 
  • ఎవుసం రూపు మారాలి..  
  • మన పంటలకు అంతర్జాతీయ మార్కెట్‌
  • ప్రపంచంతో పోటీపడేలా పంటలసాగు
  • పంటల మార్పిడితో దిగుబడులు ఎక్కువ
  • చీడపీడలు తక్కువ.. భూసారం అధికం
  • సాగు విధానానికి రైతులు అలవాటు పడాలి
  • సాగులో పరిణతికి దీర్ఘకాలిక వ్యూహాలు
  • వ్యవసాయంపై నిపుణుల భేటీలో కేసీఆర్‌


హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఏటికేడు పరిస్థితులు మారుతుంటాయి. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సాగుచేసే పంటలను కూడా మార్చుకోవాలి. రాష్ట్రంలో పంట మార్పిడి విధానమనేది రైతులకు అలవాటు కావాలి. ఈ విధానంతో ఎక్కువ దిగుబడి వస్తుంది. భూసారం పెరుగుతుంది. చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. ఇవన్నీ రైతులకు వివరంగా చెప్పాలి.’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పరంగా సంస్కరణల శకం ఈ వర్షాకాలం పంటలతో ప్రారంభమవుతోందని ప్రకటించారు. మున్ముందు తెలంగాణ వ్యవసాయం పరిణతి సాధించడానికి ప్రభుత్వం స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేస్తుందని.. దీర్ఘకాలిక వ్యూహంతో రైతులకు మార్గదర్శనం చేస్తుందని పేర్కొన్నారు. మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు వచ్చేలా, వ్యవసాయాధారిత పరిశ్రమలకు నిరంతరం ముడిసరుకు అందించే విధంగా, వేసిన పంటంతా పూర్తిగా అమ్ముడుపోయే విధంగా, ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణలో పంటల సాగు జరగాలని ఆకాంక్షించారు. ఆ రకంగా రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యవసాయం రూపురేఖలు మారాలని చెప్పారు. ప్రభుత్వం ఏంచేసినా తమ శ్రేయస్సు కోసమే చేస్తుందనే విశ్వాసం రైతుల్లో ఉందని చెప్పారు. సాగులో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో నిపుణులతో సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌ రావు, అగ్రి బిజినెస్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ సీమ, అడ్మినిరేస్టటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ శ్రీనివాసచారి, ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌ సలహాదారు గోపీనాథ్‌ కోనేటి, సీడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ కేశవులు పాల్గొన్నారు. పంటల సాగులో ఏ రకమైన మార్పులు తీసుకురావాలి? ఉత్పాదకత ఎలా పెంచాలి? రైతులు పండించిన పంటకు అదనపు విలువ జతచేయడానికి ఇప్పుడున్న పద్ధతులు ఏమిటి? కొత్తగా ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ఎరువులు, రసాయనాల వాడకంలో రావల్సిన మార్పులు ఏమిటి? పంటల మిగులు ఉండకుండా ఏం చేయాలి? తదితర అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. రానున్న రోజుల్లో ఇలాంటి చర్చలు చాలా జరిపి, తెలంగాణ వ్యవసాయానికి ఒక దశ, దిశను నిర్దేశించాలని నిర్ణయించారు. 


రాష్ట్రంలో సాగుకు అనుకూలతలు 

రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన రైతాంగం ఉందని, ఏ పంటైనా పండించే నేలలున్నాయని, ఇన్ని సానుకూలతలున్న రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయం, అగ్రి బిజినెస్‌, అగ్రి ఇండస్ర్టీ అభివృద్ధి జరగాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల్లో ఎక్కువ మంది ఈ రంగంపైనే ఆధారపడ్డారని, అందుకే ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తమ పంటను యథాతథంగా మార్కెట్‌కు తరలిస్తున్నారని, అలా కాకుండా ఆ పంటకు వాల్యూ యాడ్‌ చేయడం వల్ల ఎక్కువ ధర వస్తుందన్నారు. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లు ఏర్పాటు చేస్తోందని చెప్పారు.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు కావాల్సిన ముడి సరుకును నిత్యం అందించగలిగేలా సంఘటిత వ్యవసాయం కావాలని,  నాణ్యమైన సరుకులు తయారు చేయడం వల్ల తెలంగాణ బ్రాండ్‌కు ఓ ఇమేజ్‌ ఏర్పడుతుందని, అది అంతర్జాతీయంగా మార్కెటింగ్‌కు ఉపయోగపడుతుందన్నారు. 



మందుల వాడకంలో మార్పులు రావాలి

ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకంలోనూ మార్పు రావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల కేవలం వ్యాపారుల మాటలను నమ్మి వాటిని వాడుతున్నారని, తగిన మోతాదులో ఎరువులు, పెస్టిసైడ్స్‌ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు తెలపాలని, ఎరువులు ఎక్కువ వాడిన పంటకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ ఉండదనే విషయం వారికి అర్థమయ్యేట్లు వివరించాలని పేర్కొన్నారు. క్రాప్‌ కాలనీలు ఉన్నచోటనే ఆ పంటకు సంబంధించిన అగ్రో ఇండస్ర్టీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ రావాలని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్‌ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, సీడ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండబాల కోటేశ్వర్‌ రావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-23T07:59:35+05:30 IST