సీజనల్ యాక్షన్..!
ABN , First Publish Date - 2020-06-07T10:50:51+05:30 IST
ఏ పనయినా జీహెచ్ఎంసీ తనదైన శైలిలో చేస్తుంది. వర్షాకాలం సమీపిస్తున్న వేళ నాలాల పూడికతీత వేగిరం చేస్తారు. సీజనల్
కాలం నెత్తి మీదికొచ్చాక పనులు
సమస్యలకు పరిష్కారమంటు ప్రారంభం
నిర్మాణ పనులతో కొత్త ఇబ్బందులు
జీహెచ్ఎంసీ వింత వైఖరి
ఎల్బీనగర్లో రూ.11.45 కోట్లతో బాక్స్ డ్రెయిన్లు
హైదరాబాద్ సిటీ, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఏ పనయినా జీహెచ్ఎంసీ తనదైన శైలిలో చేస్తుంది. వర్షాకాలం సమీపిస్తున్న వేళ నాలాల పూడికతీత వేగిరం చేస్తారు. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో దోమల నివారణ, పారిశుధ్య నిర్వహణకు సెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తారు. సీజన్ మొదలైతే కానీ.. ప్రజాప్రతినిఽ దులు, అధికారులకు ఎలాంటి సమస్యలుంటాయనేది గుర్తుకు రాకపోవడం గమనార్హం. ముందస్తు చర్యలు ప్రకటనలకే పరిమితమవుతుండగా.. కాలం నెత్తి మీదకు వచ్చాక పనులు మొదలు పెడ్తున్నారు. తాజాగా అలాంటి పనే మరొకటి మొదలు పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే వర్షాలు ప్రారంభం కాగా.. వరద ముంపు ముప్పునకు పరిష్కారంగా బాక్స్ డ్రెయిన్లు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు.
వర్షపు నీటితో ప్రజలు పడుతోన్న ఇబ్బందులు.. నిర్మాణ పనుల్లో భాగంగా చేపట్టే తవ్వకాలతో రెట్టింపు కానున్నాయి. ముంపు పరిష్కారం పక్కన పెడితే... కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వర్షంతో నీట మునుగుతో న్న ఎల్బీనగర్లోని పలు ప్రాంతాల్లో రూ.11.45 కోట్లతో మూడు బాక్స్ డ్రెయిన్లు నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణ యించింది. ఎల్బీనగర్ జోన్లో వరద నీరు నిలిచి పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఆ ఏరియాల్లో వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు ఆర్సీసీ బాక్స్ డ్రెయిన్లు నిర్మించనున్నారు. ఇప్పటి కే పంజాగుట్ట మోడల్ హౌస్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో నిర్మించిన బాక్స్ డ్రెయిన్ల ప్రయోగం ఫలించిన నేపథ్యంలో ఇతర ప్రాంతా ల్లోనూ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఎల్బీనగర్ సర్కిల్లోని హస్తినాపురం వార్డు నెంబర్-16 శ్రీనగర్ కాలనీ నుంచి గాయత్రీనగర్ వరకు రూ.5.25 కోట్లతో బాక్స్ డ్రెయిన్ ప్రతిపాదించారు.
వర్షాకాలంలో గాయత్రీనగర్, హనుమాన్నగర్, శివసాయి కాలనీ, వెంకటసాయి కాలనీ, విజయదుర్గ కాలనీ ల ద్వారా శ్రీనగర్ కాలనీ మీదుగా వంగ శంకరమ్మ గార్డెన్ వద్ద ఓపెన్ డ్రెయిన్లోకి వరద నీరు ప్రవహిస్తుంది. వరద నీటి ప్రవాహ వ్యవ స్థ లేకపోవడంతో ఆయా ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వంగ శంకరమ్మ గార్డెన్ నుంచి శ్రీనగర్ కాలనీ 1వ రీచ్ వరకు రూ.2.65 కోట్లతో, హస్తినాపురంలోని చంద్ర గార్బెన్ సమీపం నుంచి శివసాయి కాలనీ వరకు రూ.3.55 కోట్లతో ఆర్సీసీ బాక్స్ డ్రెయిన్లు నిర్మిస్తున్నట్టు శనివారం విడుదల చేసిన ప్రకటనలో మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ముంపు ముప్పు తప్పుతుందని చెప్పారు. వరద నీరు నిలవకుండా బాక్స్ డ్రెయిన్లు నిర్మించాలనే ఆలోచన మంచిదే అయినప్పటికీ.. వేసవిలో ప్రారంభించకుండా వర్షాకాలం మొదలయ్యే సమయంలో పనులు చేపట్టాలనుకోవడం ఏంటన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.