ఇదేం సంప్రదాయం
ABN , First Publish Date - 2021-07-25T06:30:38+05:30 IST
బదిలీ అయిన కలెక్టర్ మురళీధర్రెడ్డి విషయంలో కొందరు జిల్లా ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.
మురళీధర్రెడ్డి సన్మానంలో అధికారుల అత్యుత్సాహం
రథంపై ఊరేగించి తాళ్లతో లాగిన జేసీలు, ఇతర ఉన్నధికారులు
రెవెన్యూశాఖలో వివాదాస్పదమవుతున్న అతి వ్యవహారం
పోలీసుశాఖ ఆనవాయితీని అమలు చేయడంతో అంతా అవాక్కు
కాకినాడ (ఆంధ్రజ్యోతి), జూలై 24 : బదిలీ అయిన కలెక్టర్ మురళీధర్రెడ్డి విషయంలో కొందరు జిల్లా ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఆయనకు సన్మానం పేరుతో అతిగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు జిల్లాలో పనిచేసి అనేకమంది కలెక్టర్లు బదిలీపై వెళ్లారు. వీరికి మర్యాదపూర్వకంగా సభ ఏర్పాటు చేసి సత్కరించడం ఆనవాయితీ. కానీ తొలిసారిగా మురళీధర్రెడ్డి పట్ల కొందరు అధికారులు స్వామిభక్తి ప్రదర్శించడం విశేషం. సన్మా నంతోపాటు శనివారం ఆయనను ప్రత్యేకం వాహనంతో కూడిన రథంపై ఎక్కించి తాళ్లతో లాగారు. జేసీ లక్ష్మీశ, ఇతర ఐఏఎస్లు, పలువురు అధికారులంతా కలిసి కలెక్టరేట్ గేటు వరకు ఊరేగించారు. పోలీసుశాఖలో మాత్రమే ఈ తరహాలో బదిలీ అయిన అధికారిని ఆనవాయితీగా రథంపై ఊరేగిస్తారు. కానీ కలెక్టరేట్ చరిత్రలో ఎప్పుడూ లేదు. దీనికి భిన్నంగా మురళీధరరెడ్డి విషయంలో కొందరు ఉన్నతాధికారులు చూపిన ఈ అతి చూసి కొందరు కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు.