నెగిటివ్ రిపోర్ట్ అప్లోడ్ చేసినా భారత్ వచ్చాక మళ్లీ టెస్ట్ చేయించుకోవాల్సిందే!
ABN , First Publish Date - 2021-02-25T13:17:06+05:30 IST
దేశంలో కరోనా కొత్త వేరియెంట్లు బయటపడటంతో విదేశీ ప్రయాణీకులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచి భారత్కు వచ్చే
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియెంట్లు బయటపడటంతో విదేశీ ప్రయాణీకులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచి భారత్కు వచ్చే వారు ప్రయాణానికి మూడు రోజుల ముందుగా చేయించుకున్న కొవిడ్-19 రిపోర్ట్ను ఎయిర్ సువిదా పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కొవిడ్-19 రిపోర్ట్లో నెగిటివ్ వస్తేనే భారత్కు వచ్చేందుకు అనుమతి ఉంటుంది. నెగిటివ్ రిపోర్ట్ అప్లోడ్ చేసినప్పటికి విదేశాల నుంచి వచ్చే ప్యాసెంజర్లు భారత్ వచ్చిన తర్వాత మళ్లీ కొవిడ్-19 టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. భారత్లోని వివిధ ఎయిర్పోర్ట్లలో వివిధ రకాలుగా కొవిడ్-19 టెస్ట్కు చార్జీలను వసూలు చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాల్లోని ఎయిర్పోర్టులలో ఒక వ్యక్తికి కొవిడ్-19 టెస్ట్ రేట్ ఏ విధంగా ఉందంటే:
కేరళలోని కొచ్చి, తిరువనంతపురం ఎయిర్పోర్టులలో రూ. 1500 నుంచి రూ. 2 వేలు.
ముంబాయి - రూ. 850,
హైదరాబాద్ - రూ. వెయ్యి,
అహ్మదాబాద్ - రూ. 800,
బెంగళూరు - ఆర్టీపీసీఆర్ ఎక్స్ప్రెస్(రూ. 3 వేలు - 30 నిమిషాల ప్రాసెసింగ్ టైమ్), ఆర్టీపీసీఆర్ నార్మల్ - రూ. 500(నాలుగు గంటల ప్రాసెసింగ్ టైమ్),
చెన్నై - రూ. 1200 నుంచి రూ. 2500,
ఢిల్లీ - రూ. 800,
కోల్కతా - రూ. 950
ఎయిర్ సువిదా పోర్టల్లో నెగిటివ్ రిపోర్ట్ను అప్లోడ్ చేసిన తర్వాత కూడా మరోమారు కొవిడ్-19 టెస్ట్ చేయడంపై ప్రవాసీయులు మండిపడుతున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న భారతీయులు కేంద్ర నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేరళకు చెందిన ప్రవాసీయులు కొవిడ్-19 టెస్ట్ను ఆపాలంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు లేఖ రాశారు. తాము నెగిటివ్ రిపోర్ట్ అప్లోడ్ చేశాక మళ్లీ కొవిడ్-19 టెస్ట్ ఏంటంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఆర్థిక ఇబ్బందులను భరించలేక స్వదేశానికి వస్తోంటే, టెస్ట్ల పేరుతో తమ దగ్గర మళ్లీ డబ్బులను వసూలు చేయడం తగదంటూ ప్రవాసులు చెబుతున్నారు.