తెరపైకి ‘మూడో కృష్ణుడు’!

ABN , First Publish Date - 2020-06-02T07:50:56+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను కమిషనర్‌గా ..

తెరపైకి  ‘మూడో కృష్ణుడు’!

రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొత్త కమిషనర్‌!!

హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇస్తేనే!!

నిమ్మగడ్డకు మళ్లీ కుర్చీ దక్కకూడదు

మరో ఆర్డినెన్స్‌ జారీకి సర్కారు కసరత్తు!

హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇస్తేనే!!


అమరావతి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను కమిషనర్‌గా పునర్నియమించాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్న జగన్‌ ప్రభుత్వం.. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తుందని ఆశిస్తోంది. అదే జరిగితే కొత్త కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌సింగ్‌ను నియమించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. రమేశ్‌కుమార్‌ మళ్లీ కమిషనర్‌ కుర్చీలో కూర్చోకుండా అడ్డుకునేందుకే ఈ వ్యూహం రచిస్తున్నట్లు తెలిసింది. నిజానికి హైకోర్టు తీర్పునకు అనుగుణంగా కమిషనర్‌గా తాను తిరిగి బాధ్యతలు స్వీకరించినట్లు రమేశ్‌కుమార్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.


కానీ ప్రభుత్వం వ్యతిరేకించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి దానిని ఉపసంహరించారు. దీంతో రమేశ్‌కుమార్‌ కమిషనర్‌గా ఉన్నట్లా. లేనట్లా అన్నది అర్థం కావడం లేదు. మరోవైపు జగన్‌ ప్రభుత్వం కమిషనర్‌గా నియమించిన జస్టిస్‌ కనగరాజ్‌ కూడా హైకోర్టు తీర్పుతో పదవిని కోల్పోయారు. దీంతో కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండడం, రాజ్యాంగబద్ధమైన పదవి ఖాళీగా ఉండకూడదన్న నియమాలను అనుసరించి.. వీరిద్దరూ కాకుండా మూడో వ్యక్తిని కమిషనర్‌గా నియమించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మన్మోహన్‌సింగ్‌ను కొత్త ఎన్నికల కమిషనర్‌గా నియమించడానికి కసరత్తు మొదలైందని సచివాలయ వర్గాల సమాచారం. అయితే దీనికి సంబంఽధించి పలు న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. 


పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 200 ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం నియమించాలి. అయితే హైకోర్టు ఈ అంశంలో జగన్‌ ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టినందున ఆ సెక్షన్‌ కింద నియమితులైన రమేశ్‌కుమార్‌ నియామకం కూడా చెల్లదని అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు గనుక హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తే.. తాజా నియామక ప్రక్రియ మొదలుపెట్టి మన్మోహన్‌సింగ్‌తో కమిషనర్‌ పదవిని భర్తీచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఆర్డినెన్స్‌ను, తద్వారా జరిగిన జస్టిస్‌ కనగరాజ్‌ నియామకాన్ని హైకోర్టు కొట్టివేయడంతో.. పాత చట్టం ప్రకారమే ముందుకు వెళ్లాల్సి ఉంది. అంటే ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, ఆపై స్థాయిలో పనిచేసిన వారినే నియమించాలి.


మన్మోహన్‌సింగ్‌ ప్రత్యేక సీఎస్‌ కేడర్‌లో రిటైరైనందున ఆయన్ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా హైకోర్టు ఓ తీర్పు వెలువరించి.. నిర్దుష్టంగా ఇన్ని రోజుల్లో అమలు చేయాలని చెప్పకపోతే.. అమలుకు 2 నెలల వ్యవధి ఉంటుందని అడ్వకేట్‌ జనరల్‌ చెబుతున్నారు. అంటే అప్పటి వరకు ఈ వాదం నడుస్తూనే ఉంటుందన్న మాట. అయితే, రాజ్యాంగబద్ధమైన పదవి ఖాళీగా ఉండకూడదు. స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఉండాలని ఒక వర్గం వాదన. అయితే  పంచాయతీరాజ్‌ చట్టంలో అలాంటి ఏర్పాట్లు లేవు. అందువల్ల కమిషనర్‌ పోస్టు ఖాళీ అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండేలా చట్టాన్ని సవరించి.. మరో ఆర్డినెన్స్‌ జారీచేసి.. దాని ప్రకారం మన్మోహన్‌ను నియమిస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది.

Updated Date - 2020-06-02T07:50:56+05:30 IST