కర్ణాటకకు త్వరలోనే కొత్త సీఎం.. ఈరోజే ప్రకటన?
ABN , First Publish Date - 2021-07-28T00:36:25+05:30 IST
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యడియూరప్ప సోమవారం రాజీనామా చేశారు. సీఎంగా సరిగ్గా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న రోజే తన రాజీనామాను బెంగళూరులోని రాజ్భవన్లో గవర్నర్ గెహ్లోత్కు సమర్పించారు.
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రానికి నూతన సీఎంను ఈ రోజే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కర్ణాకట నూతన సీఎం నిర్ణయం గురించి తమకు నివేదిక ఇవ్వాలని కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ని, జి.కిషన్రెడ్డిని రాష్ట్రానికి పంపించారు. ఈ ఇద్దరు రాష్ట్ర బీజేపీ నేతలతో ఈరోజు సమావేశమైన అనంతరం కేంద్రానికి సమాచారం ఇవ్వనున్నారు. అయితే కేంద్రం పరిధిలో ఇప్పటికే పలు పేర్లు ఉన్న నేపథ్యంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజే రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం.
ఈ విషయమై యడియూరప్ప తనయుడు బీఎస్ రాఘవేంద్ర మాట్లాడుతూ ‘‘నిర్ణయం అతి త్వరలోనే వస్తుంది. అయితే ఆ నిర్ణయం ఏంటనేది చెప్పలేం. బీజేపీ నిర్ణయాలను అంచనా వేయడం కష్టం. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్లను ముఖ్యమంత్రులుగా బీజేపీ అధిష్టానం ప్రకటించే వరకు ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు’’ అని అన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యడియూరప్ప సోమవారం రాజీనామా చేశారు. సీఎంగా సరిగ్గా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న రోజే తన రాజీనామాను బెంగళూరులోని రాజ్భవన్లో గవర్నర్ గెహ్లోత్కు సమర్పించారు. స్వచ్ఛందంగానే పదవి నుంచి దిగిపోతున్నానని యడియూరప్ప పేర్కొన్నారు.