ఇల్లే.. ఓ క్లినిక్‌!

ABN , First Publish Date - 2020-08-03T08:51:41+05:30 IST

ఇది ఒక రోగికి వైద్యుడు చెబుతున్న విషయం కాదు! కొత్తగా కొనుక్కొచ్చిన పల్స్‌ ఆక్సీమీటర్‌ను ఇంట్లో నాన్నకు ఇస్తూ... కుమారుడు చెబుతున్న జాగ్రత్తలు! అవును...

ఇల్లే.. ఓ క్లినిక్‌!

  • అందరూ కరోనా నిపుణులే!..
  • భారీగా పల్స్‌ ఆక్సీమీటర్ల కొనుగోలు
  • ఇళ్లల్లోనే ఆక్సిజన్‌ కాన్‌సెన్‌ట్రేటర్లు
  • ఆవిరి యంత్రాలకు ఫుల్‌ డిమాండ్‌
  • థర్మామీటర్‌, గ్లూకోమీటర్లకూ గిరాకీ
  • మాస్కులు, గ్లౌజులకు లెక్కే లేదు
  • ఇంటింటా విటమిన్‌, జ్వరం గోలీలు
  • ఎన్నడూ వినని లాక్‌డౌన్‌, ఐసొలేషన్‌
  • ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇవే మాటలు
  • కరోనా వైరస్‌ తెచ్చిన కొత్త మార్పులు


‘‘ఆక్సిజన్‌ రీడింగ్‌ 94కు పైన ఉంటే ఓకే. 90కంటే తక్కువగా ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరీ తక్కువకు పడిపోతే ఐరన్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవాలి. ఇక... పల్స్‌ 60కి పైన ఉండాలి. పల్స్‌ 60 కంటే తక్కువగా ఉంటే జాగ్రత్త పడాలి’’.... 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఇది ఒక రోగికి వైద్యుడు చెబుతున్న విషయం కాదు! కొత్తగా కొనుక్కొచ్చిన పల్స్‌ ఆక్సీమీటర్‌ను ఇంట్లో నాన్నకు ఇస్తూ... కుమారుడు చెబుతున్న జాగ్రత్తలు! అవును... కరోనా దెబ్బకు సామాన్యులు సైతం వైద్యం గురించి తెలుసుకోవాల్సి వస్తోంది. కొన్ని ఇళ్లు ఓ మోస్తరు క్లినిక్‌లను తలపిస్తున్నాయి! జాగ్రత్త కావొచ్చు, అతి జాగ్రత్త కావొచ్చు... ఏదైనా తప్పట్లేదు మరి! ఓ ఆరు నెలలు వెనక్కి వెళ్లండి! హోం క్వారంటైన్‌ అంటే ఏమిటో ఎందరికి తెలుసు? ‘ఐసొలేషన్‌’ అంటే ఏమిటో! కర్ఫ్యూలు తెలుసు కానీ... లాక్‌డౌన్‌ ఎరుగని దేశం మనది! కానీ, కరోనా వచ్చింది... ఇలాంటి పరిభాషను సామాన్యులకు సైతం పరిచయం చేసింది. షుగర్‌ టెస్టులు మాత్రమే తెలిసిన సామాన్యులు సైతం ఇప్పుడు యాంటీజెన్‌ టెస్టు, ఆర్టీ పీసీఆర్‌, స్వాబ్‌ల గురించి నిపుణుల్లా మాట్లాడుతున్నారు. అప్పట్లో ఎవరైనా మాస్కు పెట్టుకుని తిరిగితే... ‘వీడు బాగా ఓవర్‌ చేస్తున్నాడు’ అని మనసులో అనుకునే వాళ్లు.


ఇప్పుడు మాస్క్‌లేకుండా బయటికి వస్తే... ‘వీడికి ప్రాణాలంటే లెక్కలేకుండా ఉంది’ అని తిట్టేస్తున్నారు. గతంలో ఎవరైనా మాటిమాటికీ చేతులు కడిగితే... ‘మరీ అన్ని సార్లు కడగొద్దు. దుమ్ములో తిరిగితేనే ఇమ్యునిటీ పెరుగుతుంది’ అని మందలించేవాళ్లు. ఇప్పుడు.. ‘శానిటైజేషన్‌’ జీవితంలో ఒక భాగమైంది. అంతెందుకు.. సర్జికల్‌ మాస్క్‌, గ్లౌజ్‌లు డాక్టర్ల ముఖాలకు, చేతులకు మాత్రమే చూసేవాళ్లం. ఇప్పుడు అందరి మూతులూ ఏదోఒక మాస్కుతో బంద్‌! అంతదాకా ఎందుకు... ఎన్‌95 మాస్కులు, పీపీఈ కిట్లు చాలామంది డాక్టర్లే అరుదుగా వాడేవారు. సామాన్య ప్రజలకు వాటి గురించే తెలియదు. ఇప్పుడు... కరోనా దెబ్బతో ఎక్కడ చూసినా ఇవేమాటలు. ‘సోషల్‌ డిస్టెన్సింగ్‌’ గురించి కలలోనైనా ఆలోచించని రోజులవి. ఇప్పుడది తప్పనిసరైంది. ఇక.. కంటైన్‌మెంట్‌ జోన్‌, సింప్టమాటిక్‌, అసింప్టమాటిక్‌... ఇలా ఎన్నెన్ని కొత్త పదాలు గత 4 నెలల్లో పరిచయమయ్యాయో!


ఇవన్నీ తప్పవట...

బీపీ, మధుమేహం వంటి సమస్యలున్న వారి ఇళ్లలో బీపీ మిషన్లు, రక్తంలో చక్కెరస్థాయులను తెలిపే గ్లూకోమీటర్‌,  అతి తక్కువ ఇళ్లలో అవసరాన్ని బట్టి నెబ్యులైజర్లు.. ఉండేవి. ఇప్పుడు సీన్‌ మారింది. ఒకప్పుడు మందుల షాపుల్లో సైతం ఎక్కడో పై ర్యాకుల్లో ఉండే పలురకాల వైద్య పరికరాలు ఇప్పుడు రోడ్లమీద పెట్టి అమ్మేస్తున్నారు. ఉదాహరణకు.. పల్స్‌ ఆక్సీమీటర్‌! రక్తంలో ఆక్సిజన్‌ శాతాన్ని గుర్తించేందుకు వాడే పరికరమిది. సినిమాల్లో, ఒక స్థాయి ఆస్పత్రుల్లో మాత్రమే చూసిన పల్స్‌ ఆక్సీమీటర్‌.. ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసింది. రోజూ కనీసం 20 పల్స్‌ ఆక్సీమీటర్లు విక్రయిస్తున్నామని హైదరాబాద్‌లోని ఒక సర్జికల్‌ షాప్‌ నిర్వాహకుడు తెలిపారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వీటిని మెడికల్‌ షాప్‌లలో అమ్ముతున్నా.. ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో కొంటున్నారు. ఇక.. కరోనా బాధితుల్లో కొందరు ఆక్సిజన్‌ స్థాయులు తగ్గి హఠాత్తుగా మరణిస్తున్నారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మూడు గంటలపాటు కాన్‌సెన్‌ట్రేటర్ల ఆక్సిజన్‌ అందిస్తే మంచిదని చెబుతున్నారు.


దీంతో వాటి కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. కానీ, ధర ఎక్కువగా ఉండటంతో ఎగువ మధ్యతరగతి వారే వాటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. వాటిలో సింగిల్‌ ట్యూబ్‌, డబుల్‌ ట్యూబ్‌ అని రెండు రకాలు అందుబాటులో ఉంటాయి. సెల్‌ఫోన్‌లాగా చార్జి చేసుకుంటే... గదిలో ఉన్న వాయువును తీసుకుని, అందులోని ఆక్సిజన్‌ను మాత్రం నిల్వ ఉంచుకుంటాయివి. వీటి ధర రూ.18వేల నుంచి మొదలవుతుంది. సింగిల్‌ ట్యూబ్‌ కాన్‌సెన్‌ట్రేటర్‌ ద్వారా ఒకరికి, డబుల్‌ ట్యూబ్‌ ద్వారా ఇద్దరికి సుమారు 3 గంటలపాటు ఆక్సిజన్‌ను అందించవచ్చు. చాలా మంది వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఆవిరి పడితే కరోనా వైరస్‌ పరార్‌ అనే ప్రచారం ఊపందుకోవడంతో ఆవిరి పట్టే పరికరాలను (వేపరైజర్లు) విపరీతంగా కొనేస్తున్నారు. జ్వరం చూడ్డానికి థర్మామీటర్లూ ఎక్కువగా కొనేస్తున్నారు. ఇక... పారాసెటమాల్‌, విటమిన్‌ ట్యాబ్లెట్లు, అజిత్రోమైసిన్‌ వంటి మందులు తప్పనిసరిగా ‘అందుబాటులో’ ఉంచుకుంటున్నారు.


మాస్క్‌ మహరాజులే 

కరోనా ప్రారంభం నుంచే మాస్కులు, గ్లౌజులు, రకరకాల శానిటైజర్ల విక్రయాలు పెరిగాయి. ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది పీపీఈ కిట్లను తప్పనిసరిగా వినియోగిస్తున్నారు. ఓ మోస్తరు ఆసుపత్రిలోనే రోజుకు 40 పీపీఈ కిట్లు వాడుతున్నారు. పెద్ద ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుకు 100-200 వరకు వినియోగిస్తున్నారు.  కరోనా వచ్చిన తొలినాళ్లలో ఒక్కో పీపీఈ కిట్‌ రూ.2-3 వేలు పలికింది. ఇప్పుడు ఐదారొందలకు దొరుకుతోంది.


పల్స్‌ ఆక్సీమీటర్‌ అమ్మకాలు పెరిగాయి

కరోనా వైరస్‌ వల్ల పల్స్‌ ఆక్సీమీటర్‌లకు డిమాండ్‌ బాగా పెరిగింది. గతంలో ఎవ్వరూ వాటిని కొనేవారు కాదు. ఇప్పుడు రోజుకు సగటున 15 పల్స్‌ ఆక్సీమీటర్లు, 2 బీపీ మిషన్లు, 5 గ్లూకోమీటర్లు అమ్ముతున్నాం. పారాసెటమాల్‌, అజిత్రోమైసిన్‌, జింక్‌, బీకాంప్లెక్స్‌ లాంటి మందులు కూడా భారీగా కొంటున్నారు. వరంగల్‌లో మందుల నిల్వలు తగ్గడంతో పక్క జిల్లాల నుంచి తెప్పిస్తున్నాం.

 రేణికింది శ్రీనివాస్‌, హన్మకొండ


కషాయాల కాలం..

శొంఠి, మిరియాలు, దాల్చినచెక్క.. ఇలాంటి దినుసులన్నీ వేసి కషాయంగా కాచి వేడివేడిగా తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతుండడంతో చాలామంది ఆ బాట పట్టారు. గోరువెచ్చటి నీళ్లలో పసుపు, తులసి ఆకులు వేసి తాగేవారు కొందరు. ఇలా వంటింట్లో ఉండేవాటితోనే రకరకాల చిట్కావైద్యాలు చేయడమూ ఇటీవలికాలంలో పెరిగింది.


హలో... టెలీ మెడిసిన్‌

టెలీమెడిసిన్‌ కొత్తేమీ కాదు. అయితే... నేరుగా డాక్టర్‌ దగ్గరికి వెళ్లడానికే అత్యధికులు మొగ్గు చూపేవారు. కరోనా పుణ్యమా అని టెలీ మెడిసిన్‌ విభాగం బాగా పుంజుకుంది. వైరస్‌ భయంతో సాధారణ జ్వరాలకు, రోగాలకు చికిత్స అందించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఫోన్‌ ద్వారా వీడియో కాల్స్‌ నుంచి వైద్యుల సలహా తీసుకోవడం ఎక్కువైంది.

Updated Date - 2020-08-03T08:51:41+05:30 IST