నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-10-19T06:22:36+05:30 IST
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు, లఖీంపూర్ఖేర్లో నలుగురు రైతుల మృతికి నిరసనగా వామపక్ష నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు సోమవారం వేర్వేరుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
వామపక్షాల ఆందోళన.. 14 మంది అరెస్టు
అనకాపల్లి టౌన్, అక్టోబరు 18: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు, లఖీంపూర్ఖేర్లో నలుగురు రైతుల మృతికి నిరసనగా వామపక్ష నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు సోమవారం వేర్వేరుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సీపీఎం, సీఐటీయూ, ఐద్వా, ఎస్ఎఫ్ఐ నాయకులు అనకాపల్లి రైల్వేస్టేషన్ పట్టాలపై నిరసన తెలిపారు. అలాగే సీపీఐ జిల్లా నాయకుడు వైఎన్ భద్రం ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ వద్ద పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. పోలీసులు, ఆర్పీఎఫ్ అధికారులు 14 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ, కేంద్ర సహాయ మంత్రి అజయ్మిశ్రాను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా సంఘాలు, పార్టీల నాయకులు ఎ.బాలకృష్ణ, గంటా శ్రీరామ్, కర్రి అప్పారావు, గండి నాయనబాబు, ఎస్.అమ్మాజీ, కాళ్ల తేలయ్యబాబు, జి.తరుణ్, రాకేశ్, కోన లక్ష్మణ, కోరిబిల్లి శంకరరావు, తాకాశి వెంకటేశ్వరరావు, జి.సుభాషిణి, ధనలక్ష్మి పాల్గొన్నారు. అరెస్టయిన నాయకులను వ్యక్తిగత పూచీపై విడుదల చేశారు.