స్వేచ్ఛా భారతంపై నమ్మకం నింపిన నేతాజీ : మోదీ

ABN , First Publish Date - 2022-01-24T01:21:21+05:30 IST

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ భారత దేశానికి స్వేచ్ఛా,

స్వేచ్ఛా భారతంపై నమ్మకం నింపిన నేతాజీ : మోదీ

న్యూఢిల్లీ : నేతాజీ సుభాశ్ చంద్రబోస్ భారత దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లభిస్తాయనే నమ్మకాన్ని నింపారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఆదివారం సాయంత్రం ఆవిష్కరించిన అనంతరం మోదీ మాట్లాడుతూ, ఈ విగ్రహం దేశం పట్ల  మన కర్తవ్యాలను గుర్తు చేయడం మాత్రమే కాకుండా రాబోయే తరాలకు ప్రేరణనిస్తుందని తెలిపారు. ‘‘నేను స్వతంత్రాన్ని భిక్షగా తీసుకోబోను, నేను దాన్ని సాధించుకుని తీరుతాను’’ అని నేతాజీ చెప్పారని తెలిపారు. 


నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన రోజు చరిత్రాత్మకమైనదని చెప్పారు. ఆయన బ్రిటిషర్ల ముందు తల వంచడానికి నిరాకరించారని తెలిపారు. ఇది చరిత్రాత్మక ప్రదేశం, చరిత్రాత్మక సందర్భం అని పేర్కొన్నారు.  ‘‘చేయగలం, చేస్తాం’’ అనే నేతాజీ నినాదం నుంచి స్ఫూర్తిని పొందుతూ మనం ముందుకెళ్ళాలన్నారు.  ఆయన విగ్రహం ప్రజాస్వామిక విలువలు, భావి తరాలను ప్రేరేపిస్తుందని చెప్పారు. నేతాజీ గ్రానైట్ విగ్రహం తయారైన వెంటనే ఈ హోలోగ్రామ్ విగ్రహానికి బదులుగా స్థాపిస్తామని చెప్పారు. 


2019, 2020, 2021, 2022 సంవత్సరాలకు సుభాశ్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్‌లను ఈ సందర్భంగా ప్రదానం చేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో సైతం భూకంపాలు, వరదలు, తుపానులు వంటి అనేక విపత్తులతో మన దేశం పోరాడిందని తెలిపారు. విపత్తు స్పందన దళాల కృషి వల్ల అనేక మంది ప్రాణాలను కాపాడగలిగినట్లు చెప్పారు. 


కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ఇవి కేవలం ఓ విగ్రహం కాదని, భారత దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన నేతాజీకి తగిన నివాళి అని తెలిపారు. 


Updated Date - 2022-01-24T01:21:21+05:30 IST