ఆరోగ్యశ్రీలో లేని వ్యాధులకే సీఎం రిలీఫ్ ఫండ్
ABN , First Publish Date - 2021-03-05T06:05:56+05:30 IST
ఆరోగ్యశ్రీ పథకంలో లేని వ్యాధులకు మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులను ఇస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఎం హరికృష్ణ తెలిపారు.
గుంటూరు(మెడికల్), మార్చి 4: ఆరోగ్యశ్రీ పథకంలో లేని వ్యాధులకు మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులను ఇస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఎం హరికృష్ణ తెలిపారు. 13 జిల్లాల ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్వర్క్ ఆసుత్రల యాజమాన్యాలతో గురువారం గుంటూరు వైద్య కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. సీఎంఆర్ఎఫ్ కింద ఆయా ఆసుపత్రులు పంపే చికిత్స ఖర్చుల ప్రతిపాదలను ప్రభుత్వం పరిశీలించి ఎల్వోసీ ద్వారా లబ్ధిదారులకు చికిత్సలు అందించాలన్నారు. ఎల్వోసీ లబ్ధిదారుల నుంచి నగదు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర పబ్లిక్ హెల్త్ వైద్య సంచాలకులు డాక్టర్ గీతా ప్రసాదిని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ప్రైవేటు ఆసుపత్రి, క్లినిక్, పాలీ క్లినిక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారితో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ముఖ్య కార్య నిర్వహణాధికారి డాక్టర్ ఏ మల్లికార్జున మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ఆరోగ్య ఆసరా పథకాన్ని నెట్వర్క్ ఆసుత్రులు పూర్తి పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా నిర్వహించాలని కోరారు. సమావేశంలో జేసీ ప్రశాంతి, జేఈవో(ఆపరేషన్) డాక్టర్ రాము, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ టీ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.