నికర పరోక్ష పన్నుల వసూళ్ళలో 12 శాతం పెరుగుదల
ABN , First Publish Date - 2021-04-13T20:42:45+05:30 IST
కేంద్ర ప్రభుత్వానికి పరోక్ష పన్నుల రూపంలో ఆదాయం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి పరోక్ష పన్నుల రూపంలో ఆదాయం పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వసూలైన నికర పరోక్ష పన్నులు రూ.10.71 లక్షల కోట్లు. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వసూలైనదాని కన్నా 12 శాతం ఎక్కువ. అంతేకాకుండా సవరించిన అంచనా రూ.9.89 లక్షల కోట్లు కాగా, దీని కన్నా ఎనిమిది శాతం ఎక్కువగా వసూలైంది. దీనిలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కూడా ఉంది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది.
కేంద్ర నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు 2020-21 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనా కన్నా 4.42 శాతం పెరిగి, రూ.9.45 లక్షల కోట్లు వసూలైంది. దీనిలో ప్రధానంగా కార్పొరేట్ పన్నులు, వ్యక్తిగత ఆదాయ పన్ను ఉన్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, కంపెన్సేషన్ సెస్ వసూళ్ళు రూ.5.48 లక్షల కోట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.5.99 లక్షల కోట్లు వసూలైంది. అంటే అంతకుముందు సంవత్సరం కన్నా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ పన్నుల వసూళ్ళు 8.5 శాతం తగ్గాయి.