నెల్లూరు: విదేశీ యువతిపై అత్యాచారయత్నం.. నిందితులు వైసీపీ కార్యకర్తలు

ABN , First Publish Date - 2022-03-12T17:19:21+05:30 IST

అంతర్జాతీయ మహిళా‌ దినోత్సవం రోజున నెల్లూరు జిల్లాలో విదేశీ యువతిపై అత్యాచారయత్నం జరిగింది.

నెల్లూరు: విదేశీ యువతిపై అత్యాచారయత్నం.. నిందితులు వైసీపీ కార్యకర్తలు

నెల్లూరు: అంతర్జాతీయ మహిళా‌ దినోత్సవం రోజున నెల్లూరు జిల్లాలో విదేశీ యువతిపై అత్యాచారయత్నం జరిగింది. ఈ కేసులో నిందితులు ఇంగిలాల సాయి, షేక్ అబీద్‌ ఇద్దరూ వైసీపీ కార్యకర్తలేనని తేలింది. స్థానిక రైతు సాయంతో తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారత్‌లో పర్యాటక ప్రాంతాలు చూసేందుకు బ్రిటన్ యువతి వచ్చింది. పలు ప్రాంతాలను సందర్శించి చెన్నై నుంచి బెంగళూరు వెళ్లే అర్టీసీ బస్సు ఎక్కింది. అయితే ఆమె దగ్గర ఇండియన్ కరెన్సీ లేకపోవడంతో బస్సు నుంచి దించేందుకు కండక్టర్ ప్రయత్నించడంతో అదే బస్సులో ఉన్న సాయి కుమార్ అనే యువకుడు ఆమెకు సాయం చేసి పరిచయం పెంచుకున్నాడు. నెల్లూరు జిల్లాలో పర్యటక ప్రాంతాలను చూపిస్తానని నమ్మించాడు.


ఇంగిలాల సాయి, అతని స్నేహితుడు షేక్ అబీద్‌లు... ఇద్దరూ కలిసి విదేశీ యువతిని సైదాపురం సమీపంలో రావూరు రోడ్డువైపు తీసుకువెళ్లారు. అక్కడ అత్యాచారానికి ప్రయత్నించారు. బాధితురాలి కేకలు విన్న స్థానిక రైతు ఆమెను కాపాడారు. అదే సమయంలో ఇద్దరు నిందితులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. స్థానికుల సాయంతో విదేశీ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఆధారాలతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. నిందితులిద్దరూ వైసీపీ కార్యకర్తలేనని తేలింది. రాపూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌తో కలిసి ఉన్న ఫోటోలు ఏబీఎన్‌కు చిక్కాయి. కాగా విదేశీ యువతిని కాపాడిన రైతు సిద్ధయ్యను స్థానికులు అభినందించారు.

Updated Date - 2022-03-12T17:19:21+05:30 IST