నెల్లూరు కమిషనర్ బదిలీ..
ABN , First Publish Date - 2020-08-13T16:14:24+05:30 IST
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టీ బాపిరెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను ప్రకాశం జిల్లా..
ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి
జేసీగా కృష్ణభారతి, డీఆర్వోగా రమణ
జిల్లాలో పలువురు అధికారుల బదిలీ
నెల్లూరు(ఆంధ్రజ్యోతి): నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టీ బాపిరెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీ విషయాన్ని రెండు రోజుల క్రితమే ఆంధ్రజ్యోతి వెల్లడించడం గమనార్హం. బాపిరెడ్డి జిల్లాలో ఆత్మకూరు ఆర్డీవో, డ్వామా పీడీ, నుడా వీసీగానూ పనిచేశారు. సమర్ధుడైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. కాగా, జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా)గా టీ కృష్ణభారతిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆమె సీఆర్డీఏలో భూ వ్యవహారాల విభాగంలో స్పెషల్ కలెక్టర్గా పనిచేస్తున్నారు.
గతంలో జిల్లాలో డీఆర్వోగా పనిచేశారు. ఇప్పటి వరకు ఇన్చార్జి జేసీ (ఆసరా)గా డీఆర్డీఏ పీడీ శీనానాయక్ వ్యవహరిస్తున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) జీ మల్లికార్జున్ను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానముల ఎస్టేట్ అధికారిగా నియమించింది. జిల్లాలో ఆయన మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కొత్త డీఆర్వోగా ఎంవీ రమణను నియమించింది. ప్రస్తుతం ఆయన శ్రీకాకుళం ఆర్డీవోగా పనిచేస్తున్నారు. గతంలో జిల్లాలో తెలుగు గంగ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవోగా పనిచేశారు. అదే విధంగా సివిల్ సప్లయిస్ స్పెషల్ విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్గా ఎం శ్రీదేవిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆమె విశాఖపట్నం డీఆర్వోగా పనిచేస్తున్నారు. గతంలో శ్రీదేవి నాయుడుపేట ఆర్డీవోగా పనిచేశారు. ఇక బీసీ కార్పొరేషన్ ఈడీగా నియమితులై ఇంకా బాధ్యతలు చేపట్టని రాజగోపాల్ను కడప జిల్లాలోని జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు.