నేలకోట వంతెన అందని ద్రాక్ష

ABN , First Publish Date - 2021-06-14T04:45:31+05:30 IST

నేలకోట వంతెన అక్కడి ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. గిరిజన గ్రామాలు నానాటికీ రవాణా సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.

నేలకోట వంతెన అందని ద్రాక్ష
అటవీ మార్గంలో కాలినడకన ప్రయాణం చేస్తున్న గిరిజనులు

  • అత్యవసరమైనా, రోజువారి పనులకైనా కాలినడకే 
  • తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనులు 

మోతుగూడెం: నేలకోట వంతెన అక్కడి ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. గిరిజన గ్రామాలు నానాటికీ రవాణా సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికి ఎన్నో గ్రామాలు వెనుకబడి ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చి 74ఏళ్లు అవుతున్నా ఏజెన్సీ గ్రామాలు ఇంకా కనీస వసతులు లేక అల్లాడుతున్నాయి. ఇందుకు ఉదాహరణే నేలకోట గ్రామస్థుల దీనావస్థ. మోతుగూడెం, నేలకోట గ్రామాలకు వంతెన లేక అక్కడి గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితులు వచ్చినా, రోజువారి సరుకులు కొనుగోలు చేసుకోవాలన్నా అక్కడి ప్రజలు నరకం చూస్తున్నారు. నేలకోట గ్రామం నుంచి మోతుగూడెం రావాలంటే అటవీమార్గంలో సరైన రోడ్డు కూడా లేకుండా ఏడు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేయాలి. మండల కేంద్రం చింతూరు వెళ్లాలంటే 28 కిలోమీటర్ల కాలినడకన వెళ్లాలి. దీనికితోడు వాగులు దాటి రావాలి. ఇక్కడి గ్రామాలకు సరైన దారి మార్గం లేదు. మోతుగూడెం, నేలకోట మార్గంలో ఉన్న వాగుకు వంతెన వేస్తే రోడ్డు వేయడానికి అనుకూలంగా ఉండి రవాణా సౌకర్యాలు మెరుగుపర్చుకోవచ్చు. ఏజెన్సీ అభివృద్ధికి ప్రత్యేక అధికారులు ఉన్నా గిరిజన గ్రామాల అభివృద్ధి కానరావడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణానికి శ్రీకారం చుడితే గిరిజనుల కష్టాలు గట్టెక్కుతాయి.

Updated Date - 2021-06-14T04:45:31+05:30 IST