వర్చువల్‌‌గా ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు

ABN , First Publish Date - 2020-07-29T00:28:27+05:30 IST

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 13వ సాహిత్య సదస్సు వార్షికోత్సవం, 156వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సును డాలస్‌లో ఘనంగా నిర్వహించారు.

వర్చువల్‌‌గా ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు

డాలస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 13వ సాహిత్య సదస్సు వార్షికోత్సవం, 156వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సును డాలస్‌లో ఘనంగా నిర్వహించారు. జూం యాప్‌ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డా. కె. గీతా మాధురి, శారదా కాసీవజ్జల పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వేములపల్లి శ్రీకృష్ణ రచించిన "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా" అనే ప్రార్థనా గీతంతో మొదలైంది. ఆ తర్వాత డా. ఊర్మిండి నరసిమ్హా రెడ్డి తెలుగు సిరిసంపదలు అనే జాతీయాలు, పొడుపు కథలను వివరించారు. డాక్టర్ ఉపద్రష్ట సత్యం శ్రీకృష్ణదేవరాయల “ఆముక్త మాల్యద” ప్రబంధం నుంచి “పూచినమావులం దవిలి.. పరుమేలు తీరినన్” అన్న వసంతఋతు వర్ణన పద్యాన్ని భావయుక్తంగా చదివి అందులోని విశేషాలను వివరించారు. ఆ పద్యంలో రాయలవారు “శ్రీచణుడు” అన్న అద్భుతమైన పదప్రయోగంతో ఆదిశంకరుల వారి సౌందర్యలహరిలోని “ధనుః పౌష్పం.. మనంగో విజయతే” అన్న ఒక శోభాయమానమైన శ్లోకాన్ని ధ్వనింపజేశారని చెబుతూ ఆ శ్లోక భావాన్ని రసవత్తరంగా విశదీకరించారు.  ఆ పిమ్మట రాయలవారి ‘భువన విజయ’ సన్నివేశంలో నుంచి ఆణిముత్యం లాంటి తెనాలి రామకృష్ణుల “కలనన్ తావక ఖడ్గ ఖండిత.. కృష్ణరాయాధిపా!" అన్న పద్యాన్ని రాగ, భావయుక్తంగా ఆలపించి సందర్భసహిత వ్యాఖ్యానం చేసి సభికులను రంజింపజేశారు. ఇలాటి పద్యాలను మనం అప్పుడప్పుడు చదువుతుంటే వాటిల్లోని రసజ్ఞత పఠితలకు, శ్రోతలకు కూడా అద్భుతమైన జీవశక్తినందిస్తుందని ఉద్ఘాటించారు. కర్నాటక సంగీత సంప్రదాయంలో త్రిముూర్తులుగా కొలిచే ముగ్గురు వాగ్గేయకారులలో అగ్రజుడు శ్రీ శ్యామశాస్త్రి. రాశిలో తక్కువైనా వాసిలో మాత్రం గొప్పవిగా ఉండే కృతులను శ్యామశాస్త్రి వెలువరించారు. కంచి కామాక్షి అమ్మవారిపై వారు సృజించిన భైరవి రాగ స్వరజతి విశేషాన్ని భావ సహితంగా వేదికలో లెనిన్ బాబు వేముల స్తుతించడం జరిగింది. 


ఆ తర్వాత శారద కాసీవజ్జల గారు మాతృ భాష మనుగడకు మనవంతు బాధ్యత అనే అంశం మీద మాట్లాడుతూ.. వ్యక్తులుగా, సమూహాలుగా, సంస్థలుగా, ప్రభుత్వాలుగా చేయవల్సిన బాధ్యతలను వివరించారు. 13వ సాహిత్య సదస్సు వార్షికోత్సవం, 156వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సందర్భంగా “దేవులపల్లి కృష్ణశాస్త్రి లలిత గీతాలు” అనే అంశంపై ప్రధాన ప్రసంగం చేసిన డా. కే. గీత మాట్లాడుతూ.. దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వం అంటే అత్యంత తియ్యదనం, అనంతమైన అనుభూతి, అవధుల్లేని ప్రేమ, విహ్వల బాధ, అలవికాని వేదన, మిళితమైన కరుణ రస మాధుర్యామృతం అని పేర్కొన్నారు. కృష్ణశాస్త్రి రాసిన ఏ పాట విన్నా రాసినప్పటి భావోద్వేగం అదే మోతాదులో శ్రోతల హృదయాల్లో కలగడం గమనార్హమని, పదాల్లోని కన్నీటి చెలమలు గుండె చాటు చెమ్మని అడుగడుగునా గుర్తుచేస్తాయని అన్నారు. ఆయన రాసిన “అమృతవీణ” నుంచి “ఒదిగిన మనసునా ఒదిగిన భావమూ”, “తొలిప్రొద్దు కొండపై మొలిచెనొక దేవళము”, “రెల్లు పూలా పానుపుపైన”, “పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు”, “చరణాలు చరణాలు ముక్తి సోపానాలు”, “నీ ఆనయైన స్వామీ నా ఔదలనిడికోనా”, “అలికిడైతే చాలు-ఆశతో నాకనులు”, “మధోదయములో మంచి ముహూర్తము” వంటి సుమధుర గీతాలను.. “కృష్ణపక్షము”, “మంగళ కాహళి” నుంచి భావ, అభ్యుదయ కవితలను సభకు పరిచయం చేశారు. 


కృష్ణశాస్త్రి లలిత గీతాల్లోని విలక్షణ పదజాలాన్ని, లాలిత్యాన్ని, సాహిత్య, సంగీత విశిష్టతను పేర్కొనడమే కాకుండా, రసవత్తరంగా ఆలపిస్తూ చేసిన డా. కే. గీత ప్రసంగం సభాసదులందరినీ విశేషంగా అలరించింది. తనకు సంగీతం, సాహిత్యం రెండుకళ్లుగా ఉగ్గుపాలతో అబ్బిన విద్యలుగా పేర్కొంటూ, అందుకు దోహదం చేసిన వారి మాతృమూర్తి, గురువు, ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె.వరలక్ష్మికి సభాపూర్వకంగా నమోవాకాలు సమర్పించారు. కాగా.. ఈ కార్యక్రమానికి అనేక మంది సాహిత్య ప్రియులు హాజరై ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 13వ వార్షికోత్సవం, 156 వ సాహిత్య సదస్సు విజయవంతమవడానికి కారణమయ్యారు. స్థానిక సాహిత్య ప్రియులకు, విచ్చేసిన ముఖ్య అతిథులు డా. కే.గీతకు, శారద కాసీవజ్జలకు, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం పోషక దాతలకు, ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీడియా యాజమాన్యాలకు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు, తన కార్యవర్గం, పాలక మండలి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2020-07-29T00:28:27+05:30 IST