అంచనాల తయారీలో నిర్లక్ష్యమా..
ABN , First Publish Date - 2022-10-01T06:27:11+05:30 IST
పనులకు సంబంధించి అంచనాలు రూపొందించే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా?
తిరువూరు మున్సిపల్ అధికారుల తీరుపై అధికార, ప్రతిపక్ష సభ్యుల ఆగ్రహం
తిరువూరు, సెప్టెంబరు 30: పనులకు సంబంధించి అంచనాలు రూపొందించే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? మీరు చేసిన పొరపాట్ల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయితే బాధ్యత ఎవరిదని టీడీపీ సభ్యులు, అధికార కౌన్సిలర్లు సమావేశంలో అధికారుల తీరును తప్పుపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ గత్తం కస్తూరిబాయి అధ్యక్షతన శుక్రవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. టీడీపీ ప్లోర్లీడర్ షేక్ అబ్దుల్ హుస్సేన్, నాళ్లా సురేంద్ర మాట్లాడుతూ మే 27న జరిగిన కౌన్సిల్ సమావేశంలో మూడు ట్రాక్టర్లకు టైర్లు మార్చేందుకు రూ.1.60 లక్షలతో అంచనాలు రూపొందించగా కౌన్సిల్ అమోదించింది. తదుపరి జరిగిన సమావేశంలో మరో ట్రాక్టర్కు రూ.95 వేలతో అంజెండాలో చేర్చారు. ఇప్పుడు గతంలో ఆమోదించిన టైర్ల అంశాన్ని రద్దు చేయాలని చేర్చడంపై కౌన్సిల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషనర్ శర్మ మాట్లాడుతూ రెండు ట్రాక్టర్లకు టైర్లు ఏర్పాటుకు రూ.1.42 వేలు అయిందన్నారు. ఏఈ అంచనాలు వేయటంలో పొరపాటు వల్ల గతంలో చేసిన తీర్మానాన్ని తొలగించి తిరిగి అజెండాలో చేర్చే అవకాశం ఉందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల బోర్డు సమాదానం చెప్పుకోవల్సివస్తుందన్నారు. పట్టణంలో కోతులు, కుక్కల సమస్యలపై టీడీపీ సభ్యులు ప్రశ్నించారు.