నిర్లక్ష్యం పెరిగి!
ABN , First Publish Date - 2021-07-11T05:43:38+05:30 IST
ప్రజల నిర్లక్ష్యం... అధికారుల పర్యవేక్షణ లోపం... అంతకు మించి అన్ని వర్గాల్లోనూ కరోనా తగ్గిపోయిందన్న భావన కారణంగా జిల్లాలో వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతోంది.
ఫంక్షన్లు.. ప్రయాణాలు.. కూలి పనులు
అవే కరోనా ఉధృతికి ప్రధాన కార ణాలుగా గుర్తింపు
మాస్కులు పెట్టుకోకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం కూడా
5శాతం కన్నా పాజిటివిటీ అధికంగా ఉన్న 18 పీహెచ్సీలు
వారంలో ఎక్కువ కేసుల నమోదు కారణాలను విశ్లేషిస్తున్న అధికారులు
నేటికీ తగ్గని ఉధృతి.. తాజాగా 260 నమోదు
రాష్ట్రంలో 4వ స్థానం
ప్రజల నిర్లక్ష్యం... అధికారుల పర్యవేక్షణ లోపం... అంతకు మించి అన్ని వర్గాల్లోనూ కరోనా తగ్గిపోయిందన్న భావన కారణంగా జిల్లాలో వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతోంది. జీవనోపాధి కోసం పనులకు వెళ్తున్న కూలీలు భౌతిక దూరం పాటించడం, మాస్కులు పెట్టుకోవడం వంటి కనీస జాగ్రత్తలు లేకుండా ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. ఇక శుభ, అశుభకార్యాలను గతంలో వలే పెద్దఎత్తున నిర్వహిస్తుండగా వాటిపై నియంత్రణ లేకపోవడంతో పెద్దసంఖ్యలో బంధుమిత్రులు వెళ్తున్నారు. స్థానికంగా పట్టణాలకే కాక అంతర జిల్లాలు, అంతర్రాష్ట్ర ప్రయాణాలు కూడా పెరిగాయి. ఇలాంటి వాటి వల్లనే జిల్లాలో కరోనా కేసులు నేటికీ నిత్యం వందల సంఖ్యలో వస్తున్నట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజులు కరోనా పాజిటివిటీ రేటు 5శాతం కన్నా అధికంగా నమోదైన 18 పీహెచ్సీల పరిధిలో అధికారులు కారణాలను విశ్లేషణ చేయగా ఈ విషయం స్పష్టమైంది.
ఒంగోలు, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : దేశంలో, రాష్ట్రంలో నెలరోజులుగా కరోనా కేసులు తగ్గినప్పటికీ జిల్లాలో మాత్రం తీవ్రత తగ్గలేదు. గత రెండు, మూడు వారాలుగా ఒకటి రెండు రోజులు మినహా మిగతా అన్నిరోజులు నిత్యం 300కు అటు ఇటుగా కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో గరిష్ఠ కేసుల నమోదులో జిల్లా మూడు, నాలుగు స్థానాల్లో ఉంటోంది. జిల్లాలో సెకండ్ వేవ్లో ఏప్రిల్ 1 నుంచి ఈనెల 9 వరకు వందరోజుల్లో 61,426 పాజిటివ్ కేసులు నమోదు కాగా 364మంది మరణించినట్లు అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తోంది. తాజాగా శనివారం కూడా 260 కేసులు నమోదు కాగా ఒకరు మృతిచెందారు. అయితే ఈ కేసులు గరిష్ఠంగా నమో దు కావడం, పాజిటివిటీ రేటు అధికంగా ఉండటం కొన్ని ప్రాంతాలకే పరిమితమై కనిపిస్తోంది. దీంతో ఈనెల 5 నుంచి 8 వరకు జిల్లా లో 5 శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ ఉన్న పీహెచ్ సీలు, అందు లోనూ ఎక్కువ కేసులు నమోదైన సచివాలయాలను గుర్తించి కారణాలను అధికారులు విశ్లేషించారు.
నిర్లక్ష్యం చేస్తున్న వారికే..
ఆయా ప్రాంతాల్లో నమోదైన కేసులను చూస్తే బాధితులంతా ప్రయాణాలు, ఫంక్షన్లకు హాజరు, అలాగే వివిధ రకాల పనులకు భౌతికదూరం పాటించకుండా గుంపులుగా హాజరైనట్లు యంత్రాంగం పరిశీలనలో గుర్తించింది. ఫంక్షన్లకు హాజరైన వారు, ఇతర భౌతికదూరం పాటించకుండా మాస్కులు కూడా పెట్టుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారికి వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ కారణాలతోనే 18 పీహెచ్సీల పరిధిలోని 26 సచివాలయాలలో చేసిన శాంపిల్స్లో 5 శాతం ఎక్కువ కేసులు నమోదైనట్లు నిర్ధారించారు.
పాజిటివిటీ అధికంగా ఉన్న పీహెచ్సీలు, అధికారులు గుర్తించిన
కారణాలు ఇలా ఉన్నాయి.
కొరిశపాడు పీహెచ్సీ పరిధిలో నాలుగు రోజుల్లో 164 శాంపిల్స్ పరీక్షించగా 9.76శాతం పాజిటివిటీ తో 16మందికి కరోనా సోకింది. అందులో కొరిశ పాడు-1, 2 సచివాలయాల పరిధిలోనే 6 కేసులు వచ్చాయి. పొరుగు ప్రాంతాల నుంచి జామతోట లు, నర్సరీల్లో పనులకు కూలీలు రావడంతో పాటు చీరాల, చిలకలూరిపేట, రేణంగివరంలలో ఫంక్ష న్లకు వెళ్లి వచ్చిన వారు బాధితుల్లో ఉన్నారు.
కందుకూరు మండలం మాచవరం పీహెచ్సీల పరిధిలో 959మందికి పరీక్షలు నిర్వహించగా 9.5శాతం పాజిటివిటీతో 91మందికి వైరస్ సో కింది. ఇందులో తూర్పువడ్డెపాలెంలో 20మందికి సోకగా వారి బంధువులు హైదరాబాద్ నుంచి రావడంతో వైరస్ సోకినట్లు సమాచారం. అలాగే శ్రీనగర్ కాలనీ, జనార్దన కాలనీ, సంతోష్నగర్లలో పాతికకుపైగా కేసులు రాగా వారంతా కర్ర కోత కూలీలు, కార్పెంటర్లు. వారు ఆటోలో ఇతర ప్రాంతాలకు ప్రయాణించినట్లు గుర్తించారు.
చందలూరు పీహెచ్సీ పరిధిలో 487మందిని పరీక్షించగా 9.02 శాతం పాజిటివిటీతో 44మందికి వైరస్ సోకింది. ఇందులో ఏర్రఓబినేనిపల్లి పంచా యతీ కొర్లమడుగులో 15 కేసులు వచ్చాయి. ఆ గ్రామంలో ధ్వజస్తంభ ఆరాధన కార్యక్రమం జరగ డంతో వైరస్ వ్యాప్తి అయినట్లు సమాచారం.
అర్ధవీడు పీహెచ్సీ పరిధిలో 60 శాంపిల్స్కు 8.3 శాతం పాజిటివిటీతో 5 కేసులు రాగా మొహిద్దీన్ పురం సచివాలయ పరిధిలోని దంపతులు కంభం లో కరోనాతో మృతిచెందిన బంధువును చూసి రావడంతో వారికీ వైరస్ సోకింది.
ఇంకొల్లు పీహెచ్సీ పరిధిలో 369 శాంపిల్స్ పరీ క్షించగా 7.32 శాతంతో 27 మందికి వైరస్ సో కింది. నాదెండ్ల, సూదివారిపాలెంలోనే 18 కేసులు రాగా కర్ణాటక, హైదరాబాద్ల నుంచి గ్రామానికి వచ్చిన వారి కారణంగా సోకినట్లు గుర్తించారు.
పెట్లూరు పీహెచ్సీ పరిధిలో 756 శాంపిల్స్ పరీక్షించగా 6.88శాతం పాజిటివిటీతో 52 కేసులు వచ్చాయి. కొండపి, ఉప్పలపాడు, వెన్నూరు తది తర గ్రామాల్లో అధిక కేసులు రాగా విజయవాడ, గుంటూరులకు చదువుల కోసం వెళ్లిన వారు తిరిగి రావడం ద్వారా సోకినట్లు గుర్తించారు.
జరుగుమల్లి పీహెచ్సీ పరిధిలో 339 శాంపిల్స్ పరీక్షించగా 6.78శాతంతో 23మందికి వైరస్ సో కింది. చిరికూరపాడు జరుగుమల్లిలో అధికంగా ఉన్నాయి. పెళ్ళిళ్లకు హాజరుకావడం, బెంగళూరు ప్రాంతానికి లారీ డ్రైవర్ వెళ్ళిరావడం కారణమని గుర్తించారు.
మోదేపల్లి పీహెచ్సీ పరిధిలో 757 శాంపిల్స్ పరీ క్షించగా 6.47 శాతంతో 49 మందికి వైరస్ సోకిం ది. ఈ పరిధిలో అద్దంకిలో అధికంగా కేసులు రాగా వారిలో హైదరాబాద్, చెన్నైల నుంచి బేల్దారు ప నులకు వెళ్లిన వారు రావడం, మాస్కులు లేకుండా తిరుగుతున్న కాటికాపరులు ఉన్నట్లు గుర్తించారు.
మేదరమెట్ల పీహెచ్సీ పరిధిలోని మేదరమెట్లలో నూ కాటికాపరులకు సోకింది. పలు ఇతర ప్రాంతా ల్లోనూ ఇలాంటి కారణాలతో నే వైరస్ వ్యాప్తిగా నిర్ధారించారు.