నారసింహా.. మన్నించవయ్యా !!
ABN , First Publish Date - 2022-06-23T08:45:45+05:30 IST
రాష్ట్రానికే తలమానికంగా ఉండాలనే తలంపుతో చేపట్టిన యాదగిరిగట్టు లక్ష్మీనృసింహుని ఆలయం పునర్నిర్మాణ పనుల్లో డొల్లతనం ఒక్కొక్కటిగా బయటపడుతోంది.
- యాదగిరిగుట్టపై విద్యుద్దీపాల నిర్వహణలో నిర్లక్ష్యం
- దీపపు దిమ్మెలు విరిగిపడినా పట్టించుకోని అధికారులు
యాదగిరిగుట్ట, జూన్ 22: రాష్ట్రానికే తలమానికంగా ఉండాలనే తలంపుతో చేపట్టిన యాదగిరిగట్టు లక్ష్మీనృసింహుని ఆలయం పునర్నిర్మాణ పనుల్లో డొల్లతనం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ప్రధానాలయ తీరు వీధుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల నాణ్యతాలోపంతోపాటు, వాటి నిర్వహణలో నిలువెత్తు నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆఽధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ప్రత్యేకమైన డిజైన్లతో లోహపు దిమ్మెలు తయారు చేయించి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను ఆలయ పరిసరాల్లో అమర్చారు. వీటిలో కొన్ని గాలి వేగాన్ని తట్టుకోలేక విరిగిపడ్డాయి. ఇక, ప్రధానాలయం తూర్పు రాజగోపురం ముందున్న క్యూలైన్లకు అమర్చిన విద్యుద్దీపాలు, ప్రహరీగోడపై అమర్చిన కొన్ని దీపాలు కూడా విరిగిపోయాయి. మరికొన్ని విద్యుద్దీపాలు వినియోగంలో లేక ఎండకు ఎండి వానకు తడిసి పాడైపోతున్నాయి. కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. భారీ వ్యయంతో సమకూర్చిన ఈ విద్యుద్దీపాల అంశంపై అధికారులు దృష్టి పెట్టాలని పలువురు భక్తులు కోరుతున్నారు. కాగా, ఈ విద్యుద్దీపాల అంశంపై వివరణ కోసం ఆంధ్రజ్యోతి ప్రయత్నించగా.. ఎలక్ర్టికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) రామారావు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది.